మల్దకల్, ఏప్రిల్ 17 : జోగుళాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్లో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. మల్దకల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గ ఇన్చార్జీలు సరిత, సంపత్కుమార్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించగా ఎంపీ అభ్యర్థి మల్లు రవి హాజరయ్యారు. ప్రచార రథంపైకి ముఖ్య నేతలతోపాటు సీనియర్ నేత బండ్ల చంద్రశేఖర్రెడ్డి, ఆయన తమ్ముడు బండ్ల రాజశేఖర్రెడ్డి ఎక్కడానికి ప్రయత్నించారు. అయితే మండలంలోని పెద్దొడ్డి గ్రామానికి చెందిన పార్టీ నేత రామకృష్ణ.. తమ మండలంలో జరిగే ఎన్నికల ప్రచారంలో ఇతర మండలాలకు చెందిన నాయకులు ఎక్కవద్దంటూ చంద్రశేఖర్రెడ్డిని, అతడి తమ్ముడిని అడ్డుకున్నాడు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో రామకృష్ణ వర్గీయులు చంద్రశేఖర్రెడ్డిపై దాడి చేశారు. కొద్దిరోజుల కిందట ఆపరేషన్ చేయించుకున్న చోటే పిడిగుద్దులు గుద్దినట్టు సదరు నేత వాపోయాడు. చంద్రశేఖర్రెడ్డిని మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నొప్పులు ఎక్కువగా ఉండటంతో జిల్లా కేంద్రంలోని ప్రైవేటు దవాఖానకు తరలించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ముందుగా తన షర్ట్ను చంద్రశేఖర్ చింపారని, అందుకే గొడవ మొదలైందని రామకృష్ణ తెలిపాడు. తనకు కూడా దెబ్బలు తగిలినట్టు ఆయన పేర్కొన్నారు.