కొల్లాపూర్/నకిరేకల్, నవంబర్ 24 : కాంగ్రెస్ నాయకులకు ఓటమి భయం పట్టుకున్నది. దీన్ని జీర్ణించుకోలేని సదరు నాయకులు తమ శ్రేణులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ నాయకులపై దాడులకు తెగబడుతున్నారు. వరుస దాడులతో స్థానికంగా భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఎంత సంయమనం పాటిస్తున్నా రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా గురువారం రాత్రి నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో బీఆర్ఎస్ నాయకుడు, కొల్లాపూర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ హుజూర్ శ్రీనివాస్ యాదవ్ వాహనంపై మాజీ మంత్రి, కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు వర్గీయులు దాడి చేశారు. హుజూర్ శ్రీనివాస్యాదవ్.. తన స్వగ్రామమైన మొలచింతపల్లికి వెళ్తుండగా.. కాంగ్రెస్ నాయకులు బైక్లపై వెంబడించి వాహనంపై దాడి చేశారు. సమాచారం అందుకున్న కొల్లాపూర్ సీఐ యాలాద్రి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్తుండగా మార్గమధ్యంలో అంజనగిరి సమీపంలో కాంగ్రెస్ మూకలు తాగిన మైకంలో పోలీస్ వాహనంపైనా రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పోలీసు వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సీఐ యాలాద్రి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తనపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారని బాధితుడు శ్రీనివాస్యాదవ్ అదే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కాంగ్రెస్ నాయకులపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. దాడిలో తమ పార్టీ కార్యకర్తలు లేరని, బనాయించిన కేసులను ఎత్తివేయాలని బుకాయిస్తూ శుక్రవారం సాయంత్రం జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట రెండు గంటలపాటు ధర్నా చేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
నకిరేకల్లో వీరేశం అనుచరుల దాష్టీకం
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో రోజురోజుకూ కాంగ్రెస్ నాయకుల బెదిరింపులు మితిమీరుతున్నాయి. నిన్న బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి ఘటన మరువకముందే శుక్రవారం మరో దాష్టీకం జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య ప్రచార రథంపై, డ్రైవర్పై కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం అనుచరులు దాడికి పాల్పడ్డారు. బాధిత డ్రైవర్ ఎస్కే ఖలీల్ తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని పలు వార్డుల్లో శుక్రవారం బీఆర్ఎస్ ప్రచార రథాన్ని తిప్పుతూ బైపాస్ పద్మానగర్ వైపు వెళ్తుండగా దాదాపు 20 మందికి పైగా కాంగ్రెస్ నాయకులు వచ్చి అడ్డుకున్నారు. ‘ఈ రోజు మా వీరేశమన్న కాంగ్రెస్ మీటింగ్ ఉంది. కనపడ్తలే కొడకా.. బీఆర్ఎస్ రథాన్ని రోడ్ల మీద తిప్పితే తొక్కి సంపుతం’ అంటూ దూషిస్తూ పిడిగుద్దులతో దాడి చేశారు. ప్రచార రథం ముందుభాగంలో ఉన్న గ్లాసును పగులగొట్టారు. వెనుకభాగంలో ఉన్న మంత్రి కేటీఆర్, చిరుమర్తి లింగయ్య ఫ్లెక్సీలు, స్టిక్కర్లను చింపివేశారు. కారు స్టీరింగ్ను విరగ్గొట్టారు. కాంగ్రెస్ కార్యకర్త ఒకరు రాయితో దాడి చేయబోగా.. మరో కార్యకర్త అడ్డుకున్నాడని ఖలీల్ తెలిపారు. దాదాపు అరగంటసేపు భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు.