సూర్యాపేట, జనవరి 28 (నమస్తేతెలంగాణ): సూ ర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్పై కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలు పెట్టిన అవిశ్వాసం వీగిపోవడంతో ఆ పార్టీల కౌన్సిలర్లు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అవిశ్వాసం వీగిపోవడానికి బీఆర్ఎస్ కౌన్సిలర్ గండూరి పావనీకృపాకర్ కారణమని ఆదివారం ఆమె ఇంటికెళ్లి.. కారుపై, ఇంట్లో కోడిగుడ్లు విసిరారు. విషయం తెలుసుకున్న బీ ఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు అక్కడికి చేరుకోవడం తో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన పలువురు గాయాలపాలయ్యారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వై వెంకటేశ్వర్లు దుస్తులు చిరిగిపోయాయి. మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, ఆమె వెంట ఉన్న అనుములపురి భానుపై చేయిచేసుకోవడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. అలాగే బీఆర్ఎస్లో ఉండి చైర్మన్ పదవి కోసం ఇతర పార్టీలతో జతకట్టిన కొండపల్లి నిఖిలకు కూడా గాయాలయ్యా యి. ఇరువర్గాలకు చెందిన కౌన్సిలర్లు, నాయకుల నినాదాలు, తోపులాటలతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.
పావనికి ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పరామర్శ
కౌన్సిలర్ పావనీకృపాకర్ ఇంటిపై కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ దాడి చేసిన విషయం తెలుసుకున్న సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చి ఆమెను పరామర్శించారు. అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తే మంచిది. ఘర్షణలు, దాడులు తగవు. దౌర్జన్యాలు మితిమీరితే ప్రజలు తిరుగబడతారు.
సూర్యాపేటలో మూడు సార్లు ప్రజల చేతిలో తిరస్కరణకు గురైన రాంరెడ్డి దామోదర్రెడ్డి బుద్ధి మార్చుకోలేదు. తిరస్కరణకు కారణాలు తెలుసుకోవడం లేదు’ అని జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వారికి ఉంటుందని, వాటిని గౌరవించాల్సిన బాధ్యత ప్రధానంగా రాజకీయాల్లో ఉండే వారికి ఎంతో అవసరమని హితవుపలికారు. బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఇతర పార్టీలకు వెళ్లారని, అలాగని వారిపై తాను ఎలాంటి కక్ష పెంచుకోలేదని తెలిపారు.
పదేండ్లుగా సూర్యాపేట ఎంతో ప్రశాంతంగా ఉంటూ అభివృద్ధిలో దూసుకుపోయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున చేతనైతే మరిన్ని నిధులు తెచ్చి సూర్యాపేట అభివృద్ధిని కొనసాగించాలి తప్ప దౌర్జన్యాలు, కక్షలు సరికాదని రాంరెడ్డి దామోదర్రెడ్డికి సూచించారు. అంతకుముందుకు దాడికి నిరసనగా వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి విద్యానగర్లోని పావనీకృపాకర్ నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు.