కొత్తూరు/షాద్నగర్, జనవరి 3: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీకి చెందిన రాజకీయాలు.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో వేడెక్కిస్తున్నాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్ల క్యాంపు రాజకీయంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జ్ చేసి ఇరువురిని శాంతింపజేశారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉంటే.. అందులో 29 మంది బీఆర్ఎస్కు చెందిన వారే. అయితే.. బీఆర్ఎస్కే చెందిన కౌన్సిలర్ పొన్నగంటి మల్లయ్య అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరారు. మల్లయ్య.. మరో 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి మంగళవారం సాయంత్రం కొత్తూరు మండలంలోని వైఎం తండా వద్ద ఉన్న రిసార్ట్స్లో క్యాంపు ఏర్పాటు చేశారు. తాజాగా.. ఆ 14 మంది కౌన్సిలర్లతో కలిసి మున్సిపాలిటీలో అవిశ్వాసం పెట్టాలని కరీంనగర్ కలెక్టర్ను కోరారు. అవిశ్వాసం పెట్టే వరకు వారిని దాచిపెట్టేందుకు కొత్తూరు మండలంలోని ఎంపీఎస్ రిసార్ట్కు తరలించారు.
దీంతో అందులోని కొందరు కౌన్సిలర్లు ప్రస్తుతం జమ్మికుంట మున్సిపల్ చైర్మన్గా ఉన్న రాజేశ్వర్రావుకు ఫోన్చేసి.. పొన్నగంటి మల్లయ్య తమను బలవంతంగా కొత్తూరు మండలంలోని ఎంపీఎస్ రిసార్ట్కు తీసుకొచ్చారని తెలిపారు. ఈ మేరకు చైర్మన్ తన అనుచరులతో కలిసి మంగళవారం రాత్రి రిసార్టుకు రాగా.. అక్కడ ఉన్న సిబ్బంది గేట్ తీయలేదు. బుధవారం ఉదయం మరోసారి ప్రయత్నించినా గేట్ తీయలేదు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకుడు, కొత్తూరు మాజీ జడ్పీటీసీ సభ్యుడు మామిడి శ్యాంసుందర్రెడ్డి తన అనుచరులతో వారి దగ్గరికెళ్లి.. తమ కాంగ్రెస్ కౌన్సిలర్ల వద్దకు ఎందుకొచ్చారని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో శ్వాంసుందర్రెడ్డి అనుచరులు రాజేశ్వర్రావు, ఆయన అనుచరులపై దాడి చేశారు. ఈ దాడిలో రాజేశ్వర్రావుతోపాటు జమ్మికుంట మైనార్టీ నాయకుడు మహ్మద్ జానీ, జక్కలపల్లి సత్యనారాయణకు గాయాలయ్యాయి. అలాగే మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తనయుడు, కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్ తన అనుచరులతో కలిసి రిసార్ట్ వద్దకు చేరుకున్నారు. తమ కౌన్సిలర్లను కలువాలని రిసార్ట్ వద్ద వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న కేశంపేట, కొత్తూరు పోలీసులు రిసార్ట్ వద్దకు చేరుకుని ఇరువర్గాలపై లాఠీచార్జి చేసి చెదరగొట్టారు.
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ దాడి గర్హనీయం
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావుతోపాటు బీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకులపై కొత్త్తూరు మండలం కాంగ్రెస్ నాయకులు శ్యాంసుందర్రెడ్డి దాడి చేయడం గర్హనీయమని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. ఈ దాడిపై ఆయన కొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం స్థానిక మాజీ ఎమ్మెల్యే వై అంజయ్యయాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాపాలన అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. సీఎం సొంత జిల్లాలో దాడులు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. కౌన్సిలర్ పొన్నగంటి మల్లయ్య వద్ద సుపారి తీసుకొని శ్యాంసుందర్రెడ్డి జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావును కొత్తూరు మండలం ఇన్ముల్నర్వ గ్రామ పంచాయతీ పరిధిలోని జేపీ దర్గా సమీపంలో చంపే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వెంటనే శ్యాంసుందర్రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పొన్నగంటి మల్లయ్యకు పెద్ద నేర చరిత్ర ఉందని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు ఆరోపించారు. మాయమాటలతో జమ్మికుంట కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి మొదటగా హైదరాబాద్ తరలించి, అక్కడి నుంచి కొత్తూరు మండలం వైఎం తండా సమీపంలోని రిసార్ట్లో ఉంచారని విమర్శించారు. కౌన్సిలర్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు.