భీమారం, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : అధికార పార్టీ ఆగడాలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకుడు, సోషల్ మీడియా వారియర్ సుంకరి గోపాల్పై ఆదివారం రాత్రి దాడి జరిగిన ఘటన మంచిర్యాల డ జిల్లా భీమారం మండలంలో ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ప్రశ్నించిన నేపథ్యంలో కాంగ్రెస్కు చెందిన కొంతమంది నాయకులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుడు గోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. భీమారం గ్రామ పంచాయతీ నిధులను సర్పంచ్ ఉస్కమల్ల విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, అనుచరుల వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించారని ఆరోపిస్తూ గత వారం నుంచి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని కూడా పోస్టులు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో హైవే రోడ్డుపై గోపాల్ను అడ్డగించి గుంపులుగా చేరుకున్న కొంతమంది తీవ్రంగా దాడి చేసినట్లు సమాచారం. పోలీసుల సమక్షంలోనే గోపాల్ను కొట్టారని స్థానికులు చెబుతున్నారు. అంతకుముందు ఓ వర్గానికి చెందిన ఆలయ నిర్మాణ కార్యక్రమం పేరుతో మందు, విందు ఏర్పాటు చేసి, అక్కడే గోపాల్పై దాడికి పథకం రచించినట్లు బాధితుడు ఆరోపించాడు. తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజేందర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ఉస్కమల్ల పున్నం చందు అనుచరులు, కాంగ్రెస్ నాయకుడు ఆవుల సురేష్ యాదవ్తో పాటు మొత్తం 8 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన గోపాల్ను మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించగా, ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఘటనపై మరింత విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.