Congress | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్12 (నమస్తే తెలంగాణ):‘మహేశ్వరం నియోజకవర్గం నేత మోహన్రెడ్డిని మాట్లాడుతున్న. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రెడ్డిల గురించి మాట్లాడుతున్నడని కొంతమంది బీసీ లీడర్లు అంటున్నరు. నేను ఒక్కటే సవాల్ విసురుతున్న. బీసీలకు దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే.. ఓట్లకు, బూట్లకు ఆశపడకపోతే.. నిజాయితీగా బీసీల మీద అభిమానం ఉంటే.. చేవెళ్ల ఎంపీగా బీసీ అభ్యర్థిని గెలిపించి చూపెట్టుండ్రి. మీకు దమ్ము, ధైర్యం, నిజం, నిజాయితీ ఉంటే బీసీని గెలిపించుకోండి’…. ఇవీ చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు. బీసీలను కించపర్చేలా, బీసీల సత్తాను సవాల్ చేసిన ఈ వ్యాఖ్యలు శుక్రవారం సోషల్ మీడియాలో పెనుదుమారం రేపాయి. కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలు తమను అవమానపర్చేలా ఉన్నాయని వెనుకబడిన తరగతుల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
బీసీల ఉన్నతిని అవమానించేలా, శక్తిని చులకన చేసేలా కాంగ్రెస్ నేత మాట్లాడారని వారు మండిపడుతున్నారు. బీసీలు తమ సత్తా చూపాల్సిన సమయం వచ్చిందని వారు అభిప్రాయపడుతున్నారు. మహేశ్వరం మండలం సరిగిరిపురం గ్రామానికి చెందిన మోహన్ రెడ్డి కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ చేవెళ్ల అభ్యర్థి రంజిత్రెడ్డికి అనుకూలంగా సోషల్ మీడియాలో ఆయన తరచూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ సెల్ఫీ వీడియోతో సదరు కాంగ్రెస్ నాయకుడు కుల కుంపటిని రాజేశాడు. బీసీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. బీసీ అభ్యర్ధిని ఎలా గెలిపించుకుంటారో చూస్తామని పరోక్షంగా హెచ్చరించారు. సమాజంలో అత్యధికంగా ఉన్న బీసీలు, బీసీ నేతలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మోహన్రెడ్డి అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడంపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. మోహన్రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ వైఖరికి అద్దం పడుతున్నట్టుగానే ఉన్నాయని బీసీ నేతలు మండిపడుతున్నారు.
బీసీలను బరిలో నిలిపిన బీఆర్ఎస్
చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రధానంగా ముక్కోణపు పోటీ నెలకొన్నది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారిని తమ అభ్యర్థులుగా ప్రకటించాయి. రంజిత్రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వగా, కొండావిశ్వేశ్వర్రెడ్డిని బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటించింది. బీఆర్ఎస్ మాత్రం బీసీ సామాజికవర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను బరిలోకి దింపింది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో కాసాని బీసీల అభ్యున్నతికి విశేష కృషిచేశారు. 96 కులాల బీసీ నేతగా రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరున్న ఆయనకు కేసీఆర్ అవకాశం కల్పించారు. ఒక్క చేవెళ్ల లోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు బీసీలకు బీఆర్ఎస్ ఎంపీ టికెట్లు ఇచ్చింది. ‘బీఆర్ఎస్ బీసీ అభ్యర్థి వర్సెస్ ఇతర అగ్రకుల అభ్యర్థులు’ అన్న తరహాలో పోటీ నెలకొనడంతో అందరిచూపు చేవెళ్లపై ప్రధానంగా కేంద్రీకృతమైంది. ఈ దశలో ‘బీసీలకు దమ్ముందా..?’ అంటూ సవాల్ విసురుతూ కాంగ్రెస్ నాయకుడు మోహన్రెడ్డి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతున్నాయి. ఏ పార్టీ నుంచైనా తమ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థే గెలుస్తాడని, బీసీలు ఏమీ చేయలేరనే భావన ఆయన మాటల్లో వ్యక్తమవుతున్నదని బీసీ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయంలో బడుగులను తొక్కేందుకు ఇరుపార్టీలు ఒక్కటై పనిచేస్తున్నాయా? అని వారు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ప్రధానంగా బీసీలకు బీఆర్ఎస్ టికెట్లు ఇవ్వడాన్ని మిగిలిన పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయనడానికి మోహన్రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమని బీసీ సంఘాలు విమర్శిస్తున్నాయి.
నాలుగు నెలల్లోనే..
‘పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో రాజకీయంగా కులాల కుంపట్లు లేవు. అభివృద్ధి, సమస్యలు వంటి ప్రజా అంశాల ప్రాతిపదికనే రాజకీయ పార్టీలు తలపడ్డాయి. కానీ వీళ్లు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదు. కులాల మధ్య చిచ్చును రాజేస్తున్నారు. ఒకే సామాజికవర్గానికి పెద్దపీట వేస్తూ.. బీసీలను, దళితులను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఓ బీసీ నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం. కాంగ్రెస్ లోని బీసీ నేతలు సైతం పార్టీలోని తమను తక్కువ చేసి చూస్తున్నారని, రాజకీయంగా దెబ్బతీస్తున్నారని పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసిన ఉదంతాలను ఆయన ఉదహరించారు. బీసీలు సంఘటితం కాకపోతే.. మున్ముందు మరింతమంది నాయకులు మోహన్రెడ్డిలాగే మాట్లాడుతారని బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో బీసీల సత్తా చాటుతామని, దురహంకారపూరిత వ్యాఖ్యలకు తగిన బుద్ధి చెప్తామని వారు స్పష్టంచేస్తున్నారు