Congress | కృష్ణకాలనీ, మార్చి 2 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పేదల భూములను కబ్జా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. భూపాలపల్లి పట్టణంలోని అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఉడుత సరోజన కుమారుడు, యూత్ కాంగ్రెస్ నాయకుడు ఉడుత మహేందర్ తన అనుచరులతో కలిసి అధికార పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అనుచరులమంటూ స్థానిక కృష్ణకాలనీలో వీరంగం సృష్టిస్తున్నారని బాధితులు బండి సరోజన, గడిగొప్పుల స్నేహశ్రీ శనివారం మీడియా ముందు గోడువెల్లబోసుకున్నారు. ఇరవై ఏండ్లుగా కృష్ణకాలనీలో ఇండ్లు నిర్మించుకొని నివాసముంటున్నామనీ, కేసీఆర్ సర్కార్ 76 జీవో కింద తమకు ఇండ్లస్థలాల రిజిస్ట్రేషన్ పట్టాలు కూడా ఇచ్చిందని తెలిపారు.
కాంగ్రెస్ నేత మహేందర్ తన అనుచరులతో తమ ఇండ్ల మీదకు వచ్చి.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఈ ప్లాట్లను ఖాళీ చేయాలని ఆదేశించారని, వెంటనే వెళ్లిపోవాలంటూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదనతో చెప్పారు. ఈ ప్లాట్లు తమవని, ఎందుకు వెళ్లాలని అన్నందుకు ఇండ్లు, గోడలను కూల్చివేస్తూ దిక్కున్నచోట చెప్పుకోమని అంటున్నారని పేర్కొన్నారు. వెంటనే ఖాళీ చేయకపోతే చంపుతామని కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. మహేందర్ భయానికి శుక్రవారం రాత్రంతా వేరే చోట తలదాచుకున్నామని రోదిస్తూ చెప్పారు. అన్యాయాన్ని ప్రశ్నించిన తమపైనే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇండ్లను కూలగొట్టడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, మహేందర్ అరాచకాలతో కృష్ణకాలనీలో బతకలేక పోతున్నామని చెప్పారు. తమ భూములు దక్కకపోతే విషం తాగి ఆత్మహత్య చేసకుంటామని పేర్కొన్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులు తమ బాధను పట్టించుకొని ఎమ్మెల్యే అనుచరుల నుంచి తమను కాపాడాలని కోరారు.