కామారెడ్డి, మే 19 : సాయం చేయమని వెళ్లిన మహిళపై కాంగ్రెస్ నాయకుడు కన్నేశాడు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని అడిగితే తన కోరిక తీర్చాలని వేధించాడు. వేధింపులు పెరిగి పోతుండటంతో భరించలేని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో సదరు నాయకుడిపై కేసు నమోదైన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. రాజంపేట మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ ఇందిరమ్మ ఇల్లు కావాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిని సంప్రదించింది.
దీంతో ఇల్లు మంజూరు చేయించాలంటే తన కో రిక తీర్చాలని షరతు పెట్టాడు. ఈ వేధింపులు తట్టుకోలేకపోయి బాధితురాలు రాజంపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాధు చేసింది. సదరు నాయకుడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చిన కాంగ్రెస్ నేత బెస్త చంద్రంను అధికార పార్టీ సస్పెండ్ చేసింది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ఎవరైనా సహించేది లేదని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కృష్ణారావు తెలిపారు.