CM KCR | నిజామాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టున్నది కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తీరు. కాంగ్రెస్ ప్రకటించిన మొదటి లిస్టులో, రెండో లిస్టులోనూ ఆయనకు చోటే దక్కలేదు. అసలు ఆయనకు అవకాశం ఇస్తారో లేదో కూడా తెలియదు. కానీ, నిన్నా మొన్నటి వరకు ‘కామారెడ్డిలో కేసీఆర్ను చిత్తుగా ఓడిస్తా. తప్పకుండా కామారెడ్డి నుంచే పోటీ చేస్తా. సీఎంకు డిపాజిట్ రాకుండా చేస్తా. కామారెడ్డి ప్రజలంతా నా వైపే ఉన్నారు.
కామారెడ్డి నుంచి ఈ సారి నేనే ఎమ్మెల్యే..’ అని ప్రగల్భాలు పలికారు షబ్బీర్ అలీ. ఆయన తీరుపై సహచరులే జాలి పడుతున్నారు. కేసీఆర్ను ఢీకొట్టే సత్తా లేకనే కాంగ్రెస్ సైతం మీమాంసలో పడిందన్న చర్చ జోరుగా జరుగుతున్నది. కేసీఆర్ను ఎదుర్కొనే ధైర్యం లేకనే షబ్బీర్అలీ రోజుకో మాట మాట్లాడుతున్నారంటూ ప్రజలు భావిస్తున్నారు. షబ్బీర్ కామారెడ్డి నియోజకవర్గాన్ని వదిలి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి వెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతున్నది. ఈ విషయాన్ని షబ్బీర్ అలీ రెండు రోజుల క్రితమే ఖండించినప్పటికీ, రెండో జాబితాలోనూ ఆయన పేరు రాకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి.
షబ్బీర్ పీఛేముడ్..?
కామారెడ్డిలోని కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలంతా పక్కచూపులు చూస్తున్నారు. పార్టీ అభ్యర్థిగా ఎవరో తెలియని అయోమయంలో బీఆర్ఎస్ గూటికి చేరడమే సరైందని భావిస్తున్నారు. షబ్బీర్ అలీ నుంచి ఎలాంటి స్పందన లేకపోగా కాంగ్రెస్ అధిష్టానం సైతం ఎంతకూ నిర్ణయం తీసుకోకపోవడంతో నిట్టూరుస్తున్నారు. కాంగ్రెస్లో తన మాటే ఫైనల్ అంటూ ఇన్ని రోజులు గొప్పలు చెప్పుకున్న మంత్రి షబ్బీర్ అలీ మాటలు ఉత్తవేనన్నది తేలిపోయింది.
కాంగ్రెస్ కకావికలం..
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ బరిలో నిలవడంతో పీసీసీ ముఖ్యనేతలంతా జంకుతున్నారు. మొన్నటివరకు తాడోపేడో అంటూ తొడలు కొట్టిన వారికే కనీసం చోటు దక్కకపోవడంతో నవ్వులపాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా పోటీకి ముందే చేతులెత్తేసే పరిస్థితిని తెచ్చుకున్నది. పోలింగ్కు నెల రోజులే ఉన్నప్పటికీ హస్తం పార్టీ ఇంకా అభ్యర్థుల వేటలోనే మునిగి తేలుతున్నది.