హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే కొందరు కుట్రతో అడ్డుకోవాలని చూస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. నియామక ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు టీచర్ల ఖాళీల భర్తీని డీఎస్సీకి అప్పగించామని చెప్పారు. ఉపాధ్యాయ ఖాళీల విషయంలో తప్పుడు ఆరోపణలతో రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. విద్యారంగానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేయడాన్ని సహించలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో టీచర్ ఖాళీలను భర్తీకి ప్రయత్నిస్తున్నదని, ఈ సమయంలో అన్ని పార్టీలు, వర్గాలు సహకరించాలని కోరారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియను అడ్డుకోవాలని చూసేవారి మాటలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులు డీఎస్సీకి సిద్ధమై విజయం సాధించాలని ఒక ప్రకటనలో కాంక్షించారు.
తొమ్మిదేండ్లలో విద్యారంగం అభివృద్ధికి రూ.1,87,269 కోట్లు ఖర్చు చేసినట్టు మంత్రి సబిత చెప్పారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 2017లో తొలిసారి 8,972 పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహించామని గుర్తు చేశారు. ప్రస్తుత టీచర్ ఖాళీల్లో గెజిటెడ్ హెడ్ మాస్టర్, ప్రైమరీ సూల్ హెడ్ మాస్టర్ పోస్టులను, సూల్ అసిస్టెంట్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉన్నదని చెప్పారు. ప్రభు త్వ బడుల్లో ఖాళీగా ఉన్న 5,089 టీచర్ పోస్టులను, 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల ను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ, కొత్త నియామకాలు పూర్తయిన తర్వాత ఖాళీలు ఏమైనా ఉంటే భర్తీకి చర్యలు చేపడతామని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గురుకులాల్లో 11,715 టీచర్ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. ప్రస్తుతం 12,150 బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల ప్రక్రియ కొనసాగుతున్నదని స్పష్టంచేశారు.