ప్రభుత్వం దళితబంధు రూపకల్పన సమయంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి నేను వెళ్లాను. పథకం అమలుకు పలు సూచనలు చేశాను. దాని ప్రకారం అమలుచేస్తే దళిత కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పాను. నా నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం అభినందనీయం. దళితబంధు అమలులో జరిగే ఇబ్బందులు, లోపాలు, మంచిచెడులను పరిశీలించేందుకు సీఎల్పీ నేతగా నాకు అవకాశం లభించింది.
–సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాజకీయంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఎన్ని విభేదాలైనా ఉండవచ్చు. కానీ ప్రజా సంక్షేమ విషయంలో మాత్రం అవి అడ్డురాకూడదు. ప్రజలకు మంచి జరిగే పని ఎవరుచేసినా స్వాగతించి, వీలైతే దన్ను గా నిలబడటమే నాయకుడి లక్షణం. దళితుల జీవితాల్లో వెలుగులు నింపనున్న దళితబంధు పథకంపై రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్లోని అనేమంది నేతలు తలాతోకా లేకుం డా మాట్లాడుతున్న సమయంలో ఆ పథకం ప్రాధాన్యతను ఎరిగి వ్యవహరించారు కాం గ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేత భట్టి విక్రమార్క. దళిత సామాజికవర్గంలో పుట్టి, కష్టపడి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి చేరుకొన్న ఆయన, దళితబంధు పథకం సమాజంలో తీసుకురాబోతున్న విప్లవాత్మక మా ర్పులను ముందుగానే గ్రహించారు. అందుకే ఈ పథకంపై సీఎం కేసీఆర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు. భట్టి వైఖరిని సొంతపార్టీలోని కొందరు నేతలు వ్యతిరేకించినప్పటికీ ఆయన వెనక్కు తగ్గలేదు. తన జాతి అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకొన్న సంకల్పాన్ని ఆయన మనస్ఫూర్తిగా స్వాగతించారు. రాజకీయ పరిణతి గల నాయకుడిగా వ్యవహరించారు.
తెలంగాణ ఉద్యమంలోనూ..
కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఉద్యమాన్ని అణచివేసేందుకు అన్నిరకాల ప్రయత్నాలూ చేసింది. రాజశేఖర్రెడ్డి, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. ఆ సమయంలో శక్తిమంతులైన ఈ నేతలను ఎదిరించి స్వరాష్ట్ర ఉద్యమానికి భట్టి మద్దతు ప్రకటించారు.