నల్లగొండ సిటీ, మార్చి 27: రాహుల్గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ నల్లగొండలో సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష రసాభాసగా మారింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, చెరుకు సుధాకర్ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో దీక్షను అర్ధాంతరంగా ముగించారు. టీపీసీసీ పిలుపు మేరకు నల్లగొండ క్లాక్టవర్ సెంటర్లో డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. దీక్షలో తొలుత ఎంపీ కోమటిరెడ్డి వర్గీయులు పాల్గొన్నారు.
ఆ తర్వాత పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ తన వర్గీయులతో కలిసి అక్కడకు వచ్చారు. చెరుకు సుధాకర్ మాట్లాడుతున్న సమయంలో కోమటిరెడ్డి వర్గీయులు వెంకట్రెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు. దాంతో సుధాకర్ వర్గీయులు ప్రతి నినాదాలకు దిగడంతో గందరగోళం ఏర్పడింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. చెరుకు సుధాకర్ తన ప్రసంగాన్ని కొనసాగించడంతో కోమటిరెడ్డి వర్గీయులు దీక్షా శిబిరం నుంచి బయటకు వెళ్లిపోయారు. తర్వాత సుధాకర్ వర్గీయులు కూడా వెళ్లిపోవడంతో డీసీసీ అధ్యక్షుడు దీక్షను అర్ధాంతరంగా ముగించారు.