Gurukula Teachers | హైదరాబాద్, ఏప్రిల్12 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో నైట్డ్యూటీల అంశం వివాదాస్పదమవుతున్నది. ఉపాధ్యాయులు, అధికారుల నడుమ రచ్చకు తెరలేపింది. ఉపాధ్యాయవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సొసైటీలో కొందరు అధికారుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని నివారించి ఆత్మహత్యలను నిరోధించాలనే చర్యల్లో భాగంగా నైట్డ్యూటీ టీచర్ల సంఖ్యను 2 నుంచి నాలుగుకు పెంచుతూ గురుకుల ప్రిన్సిపాల్స్, ఆర్సీవోలకు గురుకుల సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి ఇటీవల ప్రత్యేకమైన ఉత్తర్వులను జారీ చేశారు. రెగ్యులర్ టీచర్లు అందుబాటులో లేకుంటే పార్ట్ టైం టీచర్లను కూడా వినియోగించుకోవాలని, ప్రిన్సిపాళ్లు కచ్చితంగా గురుకులంలోనే ఉండాలని, నైట్డ్యూటీ టీచర్లు రాత్రంతా మేల్కొని విద్యార్థుల కదలికలను గమనిస్తూ పర్యవేక్షించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే సెక్రటరీ ఉత్తర్వులపైనే గాకుండా, అనుసరించిన విధానంపైనా గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. విద్యా సంబంధిత అంశాలపై నిర్ణయం తీసుకునే సందర్భంలో అకడమిక్ అధికారులను సంప్రదించకుండానే నేరుగా జనరల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఉపాధ్యాయవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
జనరల్ విభాగంలోని కొందరు అధికారులు కావాలనే కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నదని ఉపాధ్యాయవర్గం ఆరోపిస్తున్నది. ఆ విభాగంలోని ఓ కీలక అధికారి సెక్రటరీని తప్పుదోవ పట్టిస్తూ, తప్పుడు నిర్ణయాలకు పురికొల్పుతున్నారని సొసైటీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా అంశాలపై అధికారులు, ఉపాధ్యాయులు రెండు గ్రూపులుగా చీలిపోయి చర్చించుకుంటున్నారు. వాట్సాప్ గ్రూపులు, వ్యక్తిగత గ్రూపుల్లో రచ్చ రచ్చ చేస్తున్నారు.
విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రయోజనం కోసమే నైట్డ్యూటీ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. నైట్డ్యూటీల అంశంపై పత్రికల్లో వచ్చిన వార్తాకథనాలపై సంస్థ ఈ మేరకు స్పందించింది. నైట్డ్యూటీలు చేసే ఉపాధ్యాయులకు సీసీఎల్ సౌకర్యాన్ని కూడా కల్పించామని , ప్రస్తుత వార్షిక పరీక్షలు పూర్తయ్యేంత వరకే ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నది.
ఉపాధ్యాయులకు నైట్డ్యూటీలను పూర్తిగా ఎత్తేయాలని సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, సిబ్బంది సంఘం డిమాండ్ చేస్తున్నది. నైట్డ్యూటీల కోసం అదనంగా సిబ్బందిని నియమించుకోవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్, కోశాధికారి మధూకర్, నేతలు బాలకృష్ణ, శ్రీనివాసశర్మ, సుధాకర్, డేవిడ్, ప్రసాద్, అశోక్రెడ్డి, పద్మ, లింగయ్య శుక్రవారం ఒక ప్రకటనలో సొసైటీ అధికారులకు సూచించారు. టీచర్లను రాత్రి కాపలాదారులుగా మార్చడం తగదని హితవు పలికారు.