KTR | వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీసీ డిక్లరేషన్ పేరిట ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. ఏడాది కిందట బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందా అని ప్రశ్నించారు. హన్మకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ మాట్లాడుతూ.. చేతిగుర్తుకు ఓటేసిన పాపానికి చేతివృత్తిదారుల గొంతు కోశారని అన్నారు. కొత్త ప్రభుత్వాలు దేవుడెరుగు. ఉన్న పథకాలే ఆగిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే రైతుబంధు, దళితబంధు పథకాలు ఆగిపోయాయని కేటీఆర్ అన్నారు. బీసీల ఓట్ల కోసం కులగణన అనే కొత్త నాటకం మొదలుపెట్టారని కేటీఆర్ అన్నారు. కులగణనలో 175 ప్రశ్నలు అడుగుతున్నారని తెలిపారు. బ్యాంకుల్లో డబ్బు ఎంత ఉంది? ఇంట్లో ఏసీ ఉందా? ఫ్రిజ్ ఉందా? అని అడుగుతున్నారని పేర్కొన్నారు. దీనిపై కులగణన కోసం వెళ్లిన అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. బీసీల ఓట్ల కోసం అధికారులను బలిపశువులను చేస్తున్నారని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. బీసీలకు 42 శాతం హామీలు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదని తెలిపారు. కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ ఉండాలని గతంలో కేసీఆర్ కోరారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతల చిత్తశుద్ధిని ప్రజలు అనుమానిస్తున్నారని తెలిపారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే తెలంగాణలో కులగణన సర్వే చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కులగణన అంటున్నారు కానీ.. బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడటం లేదని అన్నారు. తమిళనాడులో 68 శాతం రిజర్వేషన్లపై అధ్యయనానికి బీఆర్ఎస్ బృందాన్ని పంపిందని గుర్తుచేశారు. బీసీ యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు చెప్పారని తెలిపారు. ఒక్క బీసీ బిడ్డకు అయినా రూ.10 లక్షల వడ్డీ లేని రుణం ఇచ్చారా అని ప్రశ్నించారు.