Crop Loans | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు అన్నీఇన్నీ కావు. అటు రైతుబంధు ఇవ్వకుండా, ఇటు సాగుకు సరిపడా నీళ్లు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చివరకు అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారంపై నిర్ణయం తీసుకోకుండా అన్నదాతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదు రేవంత్ సర్కార్. ఎవరైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతు రుణాలు తీసుకున్నారో వారెవ్వరూ బ్యాంకులకు చెల్లించొద్దని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల సభల్లో రేవంత్ ప్రకటించారు. రైతు రుణమాఫీకి సంబంధించి డిసెంబర్ 9వ తేదీనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు గడుస్తున్నప్పటికీ అలాంటి చర్యలేమీ తీసుకోలేదు రేవంత్ ప్రభుత్వం.
అయితే రైతులు ఎవరైతే బ్యాంకుల నుంచి క్రాప్ లోన్స్ తీసుకున్నారో వారికి వేధింపులు మొదలయ్యాయి. ఆయా బ్యాంకుల అధికారులు లాయర్ల ద్వారా రైతులకు లీగల్ నోటీసులు జారీ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారు. సకాలంలో రుణాలు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో రైతులు రేవంత్ సర్కార్పై కన్నెర్రజేస్తున్నారు. అటు రైతుబంధు ఇవ్వరు.. ఇటు సాగుకు నీరందివ్వరు. చివరకు రైతు రుణమాఫీ కూడా ప్రకటించరు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నదాతలు నిప్పులు చెరుగుతున్నారు.
నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా గ్రామానికి చెందిన పగడపల్లి నాగభూషణ్ అనే రైతుకు ఇటీవలే తెలంగాణ గ్రామీణ బ్యాంకు(లక్ష్మణ్చందా బ్రాంచి) అధికారులు న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. 2020, సెప్టెంబర్ 22వ తేదీన తీసుకున్న రూ. 1,60,000 అప్పును వడ్డీతో సహా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2024, మార్చి 3వ తేదీ నాటికి అసలు, వడ్డీ కలిపి రూ. 2,32,876. 56 అయిందని తెలిపారు. నోటీసులు అందిన నాటి నుంచి 15 రోజుల్లోగా అప్పు చెల్లించాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నోటీసులు మార్చి 11వ తేదీన రైతు నాగభూషణ్కు జారీ అయ్యాయి. బ్యాంకు నోటీసులతో రైతు నాగభూషణ్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు.
Croploans1