హైదరాబాద్, మే 4(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ ఇటీవల ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానం తీసుకురావడం స్కీమ్ను ఎత్తేసే కుట్రేనని సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల సంఖ్యలో కోత విధించేందుకే ఇలా చేస్తున్నదని, అందుకు డీబీటీ విధానం ద్వారా అమలవుతున్న పలు పథకాలే నిదర్శనమని వారు ఉటంకిస్తున్నారు. సాంకేతిక సమస్యలకు తోడు, డీబీటీ విధానం అమలైతే విద్యార్థులు నిత్యం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిందేనని విద్యార్థి సంఘాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పోస్ట్మెట్రిక్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఇప్పటివరకు విద్యాసంస్థలకే ప్రభుత్వం నేరుగా చెల్లించగా, ఇకపై డీబీటీ విధానంలో ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్(ఏపీబీఎప్) ద్వారా నేరుగా వారి ఖాతాలకే నిధులు జమ చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. అయితే ఈ విధానంలో అనేక సాంకేతిక సమస్యలున్నాయని విద్యార్థి సంఘాలు, అధికారవర్గాలు సైతం చెబుతున్నాయి.
ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక మొదలు నగదు చెల్లింపులు, ఉపసంహరణ వరకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. లబ్ధిదారుని ఆధార్ నంబర్ ఈ-కేవైసీ ద్వారా ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ ధ్రువీకరణతోపాటు బ్యాంక్ ఖాతా వివరాలు ఎన్పీసీఐ(నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా), ఇతర సంస్థల ద్వారా ధ్రువీకరించుకోవాల్సి ఉంది. ఆయా వివరాల్లో ఏమాత్రం తేడా వచ్చినా కూడా డీబీటీ విధానం అమల్లో అవాంతరాలు తప్పవు. నగదు జమ, ఉపసంహరణ సైతం నిలిచిపోతుంది. ప్రస్తుతం ఆయా సాంకేతిక లోపాలను సవరించుకొనే బాధ్యతను సైతం విద్యార్థులకే ప్రభుత్వం అంటగట్టింది. ఇప్పటికే ఇదే తరహా సాంకేతిక సమస్యలను పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల విషయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్కు సైతం డీబీటీ విధానం అమలైతే అదే పరిస్థితి ఉంటుందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
డీబీటీ ద్వారా అరకొర మందికే..
డీబీటీ విధానం ద్వారా అరకొర మందికే లబ్ధిచేకూరే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. లబ్ధిదారుల సంఖ్యలో కోత విధించడానికే ప్రభుత్వం ఈ విధానానికి తెరతీసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్ సబ్సిడీ స్కీమ్ను డీబీటీ ద్వారా అమలుచేస్తున్న విషయం తెలిసిందే. అందులో అన్ని అర్హతలున్నా చాలామంది పేదలకు గ్యాస్ సబ్సిడీ జమ కావడం లేదు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా స్కీమ్ల్లోనూ అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆయా పథకాలకు అర్హత ఉన్నా కూడా కేవలం సాంకేతిక కారణాల వల్లే సగం మంది కూడా లబ్ధిపొందని పరిస్థితి ఉన్నది.
అయినప్పటికీ ప్రభుత్వం తాజాగా ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ను డీబీటీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్, డిగ్రీ, వృత్తివిద్యా కాలేజీలు అన్ని కలిపి 2500లకు పైగా ఉంటాయి. ఏటా సుమారు 14లక్షల మందికిపైగా విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ విధానం ద్వారా లబ్ధిపొందుతున్నారు. ఇప్పటివరకు కాలేజీలే ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్కు సంబంధించి విద్యార్థుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించేవి. ప్రభుత్వం పరిశీలించి మంజూరు చేసేది. ప్రస్తుతం విద్యార్థులే తమ దరఖాస్తులను సమర్పించుకోవాల్సి ఉంటుంది. సాంకేతిక అవగాహన లేక విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని, డీబీటీ అమల్లో ఇబ్బందులు తలెత్తక తప్పవని తెలుస్తున్నది. మొత్తంగా అరకొర మందికే ఫీజులు అందే అవకాశముంటున్నదని విద్యార్థి సంఘాలు వివరిస్తున్నాయి.