Krishna Water | హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): కృష్ణాజలాల్లో న్యాయమైన వాటాను సాధించే అంశంపై ప్రభుత్వానికి సోయి లేకుండా పోయింది. రాజకీయాలే పరమావధిగా శ్వేతపత్రాలను విడుదల చేస్తూ, ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతున్నదే తప్ప కీలకమైన ట్రిబ్యునల్కు సంబంధించిన అంశాలపై దృష్టి సారించలేదు. వచ్చే నెల నుంచే వాదనలు ప్రారం భం కావాల్సి ఉండగా.. అందుకు సంబంధించిన స్టేట్మెంట్ ఆఫ్ కేస్ (ఎస్వోసీ)ను దాఖలు చేయలేదు. రేవంత్ సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేక ఇంటర్ స్టేట్ విభాగం అధికారులు ఏంచేయాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
సుదీర్ఘ పోరాటంతో ట్రిబ్యునల్
కరువు, వర్షపాతం లాంటి పరిస్థితులతోపాటు సాగుకు యోగ్యమైన భూములు, క్యాచ్మెంట్ ఏరియా విస్తీర్ణం తదితర అంశాల వారీగా ట్రిబ్యున ళ్లు నదీజలాల్లో వాటాలను కేటాయిస్తాయి. అందుకు విరుద్ధంగా కేవలం అప్పటికే వినియోగంలో ఉన్న కృష్ణా జలాలను మాత్రమే ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా ఏపీ, తెలంగాణకు జలాలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు మార్గదర్శకాలను జారీచేసింది. కానీ, ఆ మార్గదర్శకాలతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంచేసింది.
అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్కు విచారణ చేసే అధికారం కల్పించాలని సుదీర్ఘ పోరాటం చేసింది. దీంతో దిగివచ్చిన కేంద్రం సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కృష్ణా జలవివాద ట్రిబ్యునల్-2కు గతేడాది అక్టోబర్లో నూతన మార్గదర్శకాలను జారీచేసింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన జలాలను ఇరు రాష్ర్టాల మధ్య పునఃపంపిణీ చేయాలని, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీల నీటి విషయాన్ని కూడా తేల్చాలని ట్రిబ్యునల్కు సిఫారసు చేసింది. దీంతో నూతన మార్గదర్శకాల ప్రకారం విచారణ చేపట్టేందుకు బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్-2 సిద్ధమైంది.
సోయిలేని సర్కారు
తెలంగాణకు అత్యంతకీలమైన కృష్ణాజలాల్లో న్యాయమైన వాటా సాధనన కోసం ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాలంటే రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర అంశాల్లో అనుభజ్ఞులైన, సమర్థులైన అధికారులు, సహాయకులను ఇంటర్ స్టేట్ విభాగంలో నియమించాలి. వారికి ఈఎన్సీ జనరల్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తుండాలి. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితే లేకుండా పోయింది. శ్వేతపత్రం తయారీ, మేడిగడ్డ పర్యటనపై దృష్టిసారించినంతగా ఇంటర్ స్టేట్ విభాగంపై, ట్రిబ్యునల్ అంశంపై ఇప్పటికీ దృష్టి సారించలేదు.
ఇంటర్ స్టేట్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, వారికి దిశానిర్దేశం చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మరోవైపు ఇంటర్ స్టేట్ విభాగం సీఈ మోహన్కుమార్ ఇటీవల నెలరోజుల సెలవుపై వెళ్లడంతో ప్రభుత్వం ఆ బాధ్యతలను ఈఎన్సీ జనరల్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న చీఫ్ ఇంజినీర్కు శంకర్నాయక్కు అప్పగించి చేతులు దులిపేసుకున్నది.
డైలమాలో న్యాయవాదులు
తెలంగాణ తరఫున ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలను వినిపించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్, రవీందర్రావు, నిఖిల్స్వామి తదితరులను నియమించింది. కానీ, ప్రస్తుత రేవంత్ సర్కారు తమను కొనసాగిస్తుందా? లేదా? అనే డైలమాలో పడిపోయిన ఆ న్యాయవాదులు విచారణకు సంబంధించిన అంశాలను పొందుపరచడానికి సంశయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తే తప్ప ట్రిబ్యునల్కు సంబంధించిన అంశాలను ముట్టుకోకూడదనే భావనలో వారు ఉన్నట్టు తెలుస్తున్నది. అయినప్పటికీ అంతర్రాష్ట్ర జలవిభాగం అధికారులతో గానీ, న్యాయవాదులతో గానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సమావేశాన్ని నిర్వహించలేదు. దీంతో ఏం చేయాలో తెలియక అంతర్రాష్ట్ర జలవిభాగం అధికారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
నేటికీ దాఖలు చేయని ఎస్వోసీ
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కాలంటే ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించాల్సి ఉన్నది. కృష్ణా జలాల కేటాయింపులో గతంలో జరిగిన అన్యాయంతోపాటు న్యాయపరంగా ప్రస్తుతం ఎంత వాటా వస్తుంది? ఏ కారణంతో జలాలను కేటాయించాలి? అందుకు గల ఆవశ్యకతలు ఏమిటి? అనే విషయాలను సహేతుకంగా ట్రిబ్యునల్కు వివరించాల్సి ఉన్నది. దీనినే స్టేట్మెంట్ ఆఫ్ కేస్ (ఎస్వోసీ) అంటారు. దీన్ని 6 నెలల్లోగా దాఖలు చేయాలని ట్రిబ్యునల్ గతేడాది నవంబర్లో ఇరు రాష్ర్టాలను ఆదేశించింది. ఈ గడువు ఈ నెల 14తోనే ముగిసింది. వచ్చే నెల 5, 6,7 తేదీల్లో ట్రిబ్యునల్ విచారణ కొనసాగనున్నది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎస్వోసీని దాఖలు చేయలేదు.