Fee Reimbursment | హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని డీబీటీ (డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్) విధానంలోనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిర్ణయించింది. విద్యార్థుల ఖాతాలకే నేరుగా నిధులను జమచేయనున్నది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను వారంలోగా సదరు విద్యార్థులు ఆయా కళాశాలలకు చెల్లించాల్సిందేనని, లేదంటే చట్టం పరిధిలో వసూలు చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఈ స్కీమ్కు సంబంధించిన నూతన మార్గదర్శకాలు జారీచేయడంతోపాటు, గతంలో జారీచేసిన జీవో7ను రద్దు చేస్తూ కొత్తగా జీవో8, 9ను విడుదల చేసింది. ఆ జీవోలను మాత్రం బహిర్గతం చేయకపోవడం గమనార్హం. నిధుల చెల్లింపు టైమ్లైన్ తప్ప గత జీవోకు, కొత్త మార్గదర్శకాలకు మధ్య తేడా ఏమీ లేదని తేలింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ తదితర నిరుపేద విద్యార్థుల పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లు, కాలేజీ ట్యూషన్, మెయింటెనెన్స్ ఫీజులను ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. 2008 నుంచి అమలు చేస్తున్న మార్గదర్శకాలకు విరుద్ధంగా గత ఏప్రిల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీచేసింది.
అందుకు సంబంధించి జీవో7ను విడుదల చేసింది. ఈ స్కీమ్ నిధులను కాలేజీ యాజమాన్యాలకే ప్రభుత్వం చెల్లిస్తూ వస్తుండగా, 2026-27 విద్యా సంవత్సరం నుంచి అర్హులైన విద్యార్థులకే నేరుగా డీబీటీ విధానంలో చెల్లించాలని నిర్ణయించింది. విద్యార్థులకు చెల్లించిన తర్వాతే కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకోవాలనే నిబంధననూ విధించింది. దీనిపై కుల సంఘాలు, విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తిన నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ జీవోనూ రద్దు చేసింది. అందుకు సంబంధించి జీవో8ని విడుదల చేసింది. ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏపీబీఎస్ (ఆధార్ పేమెంట్ బ్రిడ్జి సిస్టమ్) మార్గదర్శకాల మేరకు ఫీజుల చెల్లింపునకు రాష్ట్రంలో మిగిత అన్నివర్గాల విద్యార్థులకు ఏకీకృత విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. అదీగాక హైకోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని జీవో7ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి గత జీవో7ను రద్దు చేయడంతోపాటుగా నూతన మార్గదర్శకాలను సైతం ప్రభుత్వం ఖరారు చేసింది. అందుకోసం జీవో9ను విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు పోస్ట్మెట్రిక్ సాలర్షిప్లు, ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ (ఆర్టీఎఫ్), మెయింటెనెన్స్ ఫీజు (ఎంటీఎఫ్) చెల్లింపులను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నది. ఫీజుల నిర్ణయం, అర్హత ప్రమాణాలు తదితర నిబంధనలన్నీ పాత జీవోల ప్రకారమే కొనసాగుతాయని తెలుపడం గమనార్హం. పథకం అమలుకు ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ను రాష్ట్రస్థాయి నోడల్ అధికారిగా ప్రభుత్వం నియమించింది. కరస్పాండెన్స్ కోర్సులకు ప్రత్యేక మార్గదర్శకాలు తదుపరి జారీ చేయనున్నట్టు తెలిపింది.
కోర్సు పూర్తయ్యే వరకు సాలర్షిప్ కొనసాగుతుంది. విద్యార్థి విద్యాప్రగతి సంతృప్తికరంగా ఉండాలి. కనీసం 75% హాజరు కలిగి ఉండాలి. విద్యార్థి అదే కోర్సులో కొనసాగాలి. 2026-27లో చేరిన ప్రతి విద్యార్థీ ఆధార్ ధృవీకరణ చేయించుకోవాలి. 2026-27 తర్వాత చేరిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం కొత్త అప్లికేషన్ అవసరం లేదు. కళాశాల ప్రమోషన్ ధ్రువీకరిస్తే ఆటోమేటిక్ రెన్యువల్ జరుగుతుంది. విద్యార్థి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
విద్యార్థిని చేర్చుకునేటప్పుడు ఫీజులు విద్యార్థే చెల్లించాలనే అవగాహనతో కళాశాలల యాజమాన్యాలు అడ్మిషన్ ఇవ్వాలి. ప్రతి కళాశాల డీబీటీ విధానాన్ని గౌరవించాలి. నోడల్ అధికారిని నియమించాలి. విద్యార్థుల పత్రాలను ఈ-పాస్లో అప్లోడ్ చేయాలి. రెన్యువల్ అప్లికేషన్లను ధ్రువీకరించాలి. ఆధార్ ఆధారిత హాజరు వ్యవస్థ అమలు చేయాలి. సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ రిడ్రసల్ ఆఫీసర్ను నియమించాలి. ఆడిట్ కోసం అవసరమైన రికార్డులు ఇవ్వాలి. విశ్వవిద్యాలయాలు, బోర్డులు, విద్యాశాఖలు తమ విద్యార్థుల డాటాను ఈ-పాస్కు అందించాలి. ఎప్సెట్, ఈసెట్, ఐసెట్, పీజీసెట్, లాసెట్, తదితర సెట్ల కన్వీనర్లు తమ డాటాను ఈ-పాస్తో పంచుకోవాలి. ఈ-పాస్ పోర్టల్లో ఆన్లైన్ ఫిర్యాదుల పరిషార వ్యవస్థ ఏర్పాటుచేయాలి. కళాశాల స్థాయిలో నిర్ణీత గడువులో సమస్య పరిషారం కాకపోతే జిల్లా స్థాయికి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయికి ఆటోమెటిక్గా ఫిర్యాదు బదిలీ అవుతుంది.
ప్రతి సంవత్సరం ఈ పథకం పనితీరును ప్రభుత్వం పరిశీలిస్తుంది. డిగ్రీ, అంతకంటే పైస్థాయి కోర్సులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కళాశాలలను ఏటా తప్పనిసరిగా తనిఖీచేస్తారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు, తప్పుడు సమాచారం ఇచ్చి సాలర్షిప్ పొందితే వెంటనే రద్దుచేస్తారు. విద్యార్థికి అప్పటికే చెల్లించిన డబ్బు తిరిగి వసూలు చేస్తారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ సాలర్షిప్నకు అర్హుడు కాకుండా బ్లాక్ లిస్ట్లో పెడుతారు. కోర్సు మధ్యలో చదువు మానేస్తే సంబంధిత సంక్షేమ శాఖ నిర్ణయం ప్రకారం సాలర్షిప్ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి కూడా రావచ్చు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు మార్చితే ఈ జీవోలో కూడా మార్పులు చేయవచ్చు. కొత్త డీబీటీ విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా చేరిన విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. 2026-27కు ముందు ఇప్పటికే సాలర్షిప్ పొందుతున్న విద్యార్థులు పాత నిబంధనల ప్రకారమే కొనసాగుతారు. డీబీటీ నిబంధనలు వర్తించబోవు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించిన జీవో8, 9ను ప్రభుత్వం మూడు రోజుల క్రితమే విడుదల చేసింది. ఈ మేరకు సంక్షేమ శాఖల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోశ్ 6వ తేదీనే వీటిని వెలువరించారు. కానీ ఈ జీవోలను ప్రభుత్వం వెబ్సైట్లోనూ పొందుపరచకుండా గుట్టుగానే తొక్కిపెట్టింది. జీవోల విడుదల కోసం ప్రత్యేకంగా పాలిసెట్ తొలివిడత సీట్ల కేటాయింపును సైతం నిలుపుదల చేసింది. జీవోలను విడుదల చేసిన అనంతరం 6వ తేదీన అర్ధరాత్రి వేళ తొలివిడత సీట్లను కేటాయించింది. విద్యార్థులకు సీటు కేటాయింపు ఆర్డర్లలోనూ ఆ జీవోల ప్రకారమే బోధన ఫీజులు చెల్లిస్తామని ప్రభుత్వం పొందుపరచడం గమనార్హం. తాజాగా ఎప్సెట్, ఈసెట్ ప్రవేశాల కమిటీ సమావేశాల్లోనూ ఫీజుల విషయంపై చర్చ కొనసాగింది. అయినా ఆ జీవోలను సర్కార్ వెల్లడించలేదు. జీవోలను గుట్టుగానే కొనసాగించడం గమనార్హం. విద్యార్థులు, కులసంఘాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతుందనే కారణంతోనే ప్రభుత్వం ఆ జీవోలను తొక్కిపెట్టిందని తెలుస్తున్నది.