కేసీఆర్ పదేండ్లపాటు వ్యతిరేకించిన కరెంట్ స్మార్ట్ మీటర్లను.. నెత్తికెత్తుకున్నది కాంగ్రెస్ సర్కార్. వినియోగదారులకు స్మార్ట్ మీటర్లతో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ వ్యవహారంలో భారీ దోపిడీకి స్కెచ్ వేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రీపెయిడ్ మీటర్లతో ప్రజల జేబుకు చిల్లు తప్పదని విద్యుత్తు రంగనిపుణులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులకు ‘స్మార్ట్’మీటర్ల ఏర్పాటుతో షాక్నిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు బిగించేందుకు ఇప్పటికే రంగం సిద్ధంచేసింది. విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) నుంచి అనుమతి రాగానే ఈ మీటర్లను బిగించనున్నారు. మొత్తంగా స్మార్ట్ మీటర్ల పేరిట భారీదోపిడీకి సర్కార్ స్కెచ్ వేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విధానంలో మొబైల్ రీచార్జ్ తరహాలో విద్యుత్తు వినియోగదారులు ముందే రీచార్జ్ చేసుకోవాలి. నెలరోజుల ముందే వినియోగానికి ముందస్తు బిల్లులు చెల్లించాలి. ఆ తర్వాత నెలరోజులు వినియోగించిన విద్యుత్తుకు బిల్లు జారీ అవుతుంది. ఆ బిల్లు జారీ అయిన తేదీ నుంచి 16 రోజుల్లోపు ఆ మొత్తానికి నగదు చెల్లించాలి. లేదంటే 14 రోజుల తర్వాత విద్యుత్తు కనెక్షన్ను తొలగిస్తారు. ఆలస్యమైతే జరిమానాలు కూడా విధిస్తారు. దీంతో స్మార్ట్ మీటర్ల పేరిట సర్కార్ దోపిడీ చేయనున్నదన్న ఆందోళనలు వినియోగదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఈ స్మార్ట్మీటర్లతో 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకానికి కత్తెర పెట్టబోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పారదర్శకత పేరిట రీడింగ్ను అధికంగా చూపే ప్రమాదం పొంచి ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రీడింగ్ పెరిగితే 200 యూనిట్ల స్లాబ్ దాటితే ఉచిత పథకాన్ని తొలగిస్తారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్మార్ట్ మీటర్ల బిగింపునకు అయ్యే వ్యయాన్ని వినియోగదారులే భరించాలి. ఏకకాలంలో కాకుండా విడుతల వారీగా డిస్కమ్లు ఈ మొత్తాన్ని వసూలు చేసుకుంటాయి. ఇది కూడా వినియోగదారులకు భారం కానున్నది. స్మార్ట్మీటర్ల ఏర్పాటు, మీటరింగ్ వ్యవస్థ ఆధునీకరణ పేరిట కేంద్ర విద్యుత్తు సంస్థ (సీఈఏ) ఇన్స్టాలేషన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ మీటర్స్ సవరణ నిబంధనలు-2026 పేరిట గెజిట్ను విడుదల చేసింది. ఆ ఆదేశాలను పాటించేందుకు, మీటర్లు బిగించేందుకు డిస్కమ్లు సిద్ధమవుతున్నాయి. సగటు వినియోగాన్ని బట్టి స్లాబులను నిర్ధారిస్తారు. సగటు వినియోగం కంటే ఎక్కువ విద్యుత్తును వాడుకున్నా సరఫరాను నిలిపేస్తారు.
విద్యుత్తు స్మార్ట్మీటర్ల ఏర్పాటు అంశంపై సర్వత్రా వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. అనేక రాష్ర్టాల్లో ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. కొన్ని రాష్ర్టాల్లో మీటర్లను రోడ్లపై వేసి తగులబెడుతున్నారు. వివాదాస్పద మీటర్లతో అనేక నష్టాలున్నాయని ఆందోళన చెందుతున్నారు. రీచార్జ్ బ్యాలెన్స్ పూర్తయితే ఆటోమెటిక్గా విద్యుత్తు సరఫరా నిలిచిపోతుంది. ఒకేసారి రీచార్జ్ చేయలేని కుటుంబాలు విద్యుత్తు సరఫరాకు నోచుకోలేని పరిస్థితి తలెత్తుతుంది. వినియోగదారులు చేసుకున్న అడ్వాన్స్ రీచార్జ్ మొత్తం విద్యుత్తు సంస్థల ఖాతాకే చేరుతుంది. అంటే ఈ రూపంలో విద్యుత్తు సంస్థలకు భారీ ఆదాయం సమకూరుతుందన్న మాట. సాంకేతిక లోపాలతో తప్పుడు వినియోగం నమోదైతే బిల్లులపై వివాదాలు తలెత్తే ప్రమాదం పొంచి ఉన్నది. ఇటీవలి కాలంలో అనేక సైబర్ దాడులు జరుగుతున్నాయి. స్మార్ట్ మీటర్ల డాటా భద్రంగా ఉంటుందా? డాటాను తారుమారు చేస్తే బాధ్యలెవరు? అన్న సందేహాలు పట్టిపీడిస్తున్నాయి. నెట్వర్క్ సమస్యలు, సాంకేతిక సమస్యలు తలెత్తితే బాధ్యలెవరు? అన్న ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. వినియోగదారులు ఎంతగా వ్యతిరేకిస్తున్నా, ఆందోళనలు జరుగుతున్నా స్మార్ట్మీటర్ల ఏర్పాటుకే మొగ్గచూపడం గమనార్హం.
గతంలో హైదరాబాద్ నగర పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్గా సుమారు 12 వేల స్మార్ట్ మీటర్లను అమర్చారు. నేషనల్ స్మార్ట్ గ్రిడ్మిషన్ డేటా ప్రకారం ఈ ప్రాజెక్టులో 11,904 మంది వినియోగదారుల కోసం ఈ మీటర్లను అమర్చారు. ఈ అనుభవం ఆధారంగానే ఇప్పుడు టీజీఎస్పీడీసీఎల్ వ్యాప్తంగా అమలు చేయనున్నారు. కొత్తగా విద్యుత్తు కనెక్షన్ తీసుకొనే వినియోగదారులకు ఇకపై స్మార్ట్మీటర్లే ఇస్తారు. ఆ తర్వాత దశలవారీగా కార్యాలయాలు, వ్యాపారవాణిజ్య సంస్థలు, అధిక వినియోగం ఉన్న గృహాలకు అమర్చనున్నట్టు తెలిపారు.
కొత్తగా విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్న చోట స్మార్ట్ మీటర్లు పెడుతుంటే.. మరోవైపు పాతవాటిని కూడా స్మార్ట్వైపునకు మరల్చే దిశగా ఎస్పీడీసీఎల్ యాజమాన్యం తమ సిబ్బందికి ఆదేశాలిచ్చినట్టు సమాచారం. ఈ మేరకు తమ పరిధిలో ఉన్న మీటర్ల వివరాలను సేకరించి వాటిలో ఏయే ప్రాంతాల్లో ముందుగా స్మార్ట్మీటర్లు అమర్చాలోననే విషయాన్ని పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్తో పాటు బంజారాహిల్స్ సర్కిల్లో పాతవాటికి బదులు స్మార్ట్మీటర్లను బిగించడం, దశల వారీగా అన్ని సర్కిళ్లలో ఇదే ఆలోచనను అమలు చేయడానికి డిస్కమ్ అధికారులు సిద్దమైనట్టు ఒక ఉన్నతాధికారి చెప్పారు. ఎప్పుడు ఏ సమయంలో మీటర్ మారుతుందో మాత్రం ఇప్పుడే చెప్పలేమని, జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 63 లక్షల కనెక్షన్లు ఉన్నాయని, ఇందులో డొమెస్టిక్, కమర్షియల్ కనెక్షన్లను చూసుకుంటూ ముందుగా కమర్షియల్ను పూర్తిచేసి ఆ తర్వాత గృహ వినియోగదారులవైపు దృష్టి పెడతామని ఆ అధికారి చెప్పారు.