హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 22(నమస్తే తెలంగాణ): భూమికి భూమి.. ఇల్లుకు ఇల్లు పరిహారంగా ఇస్తామంటూ ప్రభుత్వం చెప్తున్న మాటలు విని ఆశపడితే గోసపడుతామని సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ సూచించారు. మూసీ పునరుజ్జీవనం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్వాసులు ఆదివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కే శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఓ వైపు పరిహారం ఇస్తామని సీఎం రేవంత్ వివిధ సందర్భాల్లో చెప్తుం టే.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాత్రం ఎంఆర్డీసీఎల్ చైర్మన్ టీడీఆర్ ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు.
మధు పార్క్లో వివిధ ప్రాంతాలు, రాష్ర్టాల వారంతా ఒక కుటుంబంలా నివసిస్తున్నామని, అందరం కలిసికట్టు గా ప్రభుత్వం పెట్టే ప్రలోభాలకు లొంగకుండా ఇండ్లు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇండ్లను కాపాడుకోవడమే మనం పొందే పరిహారమని స్పష్టంచేశారు. నిరసనకు మూసీ జన ఆందోళన్, తెలంగాణ బస్తీ జేఏసీ ప్రతినిధులు మద్దతు తెలిపారు. మూసీ జన ఆందోళన్ ప్రతినిధులు జీవన్కుమార్, సంజ య, సంజీవ్ తదితరులు మధుపార్క్ నివాసితులే కాదు మూసీకి ఇరువైపులా ఉన్న బాధితులంతా ఐక్యంగా ఉంటేనే న్యాయం జరుగుతుందని స్పష్టంచేశారు.
ఇది ఒక్క అపార్ట్మెం ట్, ఒక్క బస్తీ సమస్య కాదని మొత్తం మూసీ పరీవాహక ప్రజల సమస్య అని తెలియజేశా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మూసీ పరీవాహకంలోని ఇండ్లను కూల్చేందుకు ఉమ్మడిగా ప్రయత్నిస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ బస్తీ జేఏసీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ కోరారు. నిరసనలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ చక్రపాణి, జర్నలిస్టు తులసీ చందు, ఉద్యమకారుడు విఠల్ పాల్గొన్నారు.
మధుపార్క్ అపార్ట్మెంట్లో తమ ఇండ్ల ను కాపాడాలంటూ రాహుల్ గాంధీకి రాసిన పోస్టుకార్డులను ప్రదర్శించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని, హక్కులను కాపాడుతామ ని తిరుగుతున్న రాహుల్ తమకు జరుగుతున్న అన్యాయాన్ని చూడాలని పోస్టుకార్డుల్లో పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ అంటే అభివృద్ధి పేరిట ప్రజల ఇండ్లు కూల్చడమేనా అని ప్రశ్నించారు. రేవంత్ చేస్తున్న రాజ్యాంగ వి ధ్వంసాన్ని గమనించి న్యాయం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని ఆపి తమ ఇండ్లను కాపాడాలని వేడుకున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ప్రజలను వేధిస్తుంటే రాహుల్కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
ప్రాణాలు తెగించి దేశం కోసం పోరాటం చేసిన సైనికులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాసితులను చేస్తున్నదని మధుపార్కు అపార్ట్మెంట్లోని మాజీ సైనికులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సేవ చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విలువ ఇదేనా? అని నిలదీశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సైనికులను సైతం వదిలిపెట్టకుండా ఇండ్లను లాక్కుంటూ నియంతృత్వ పాలన సాగిస్తున్నదని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా మనుసు మార్చుకొని తమను రోడ్డున పడేయొద్దని కోరారు. లేకపోతే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేందుకు తాము చేసిన యుద్ధం తరహాలోనే ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని స్పష్టంచేశారు.