ఊట్కూర్ : విద్యారంగ ( Education ) సమస్యల పరిష్కారం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని పీడీఎస్యూ( PDSU ) రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వి , ప్రధాన కార్యదర్శి అనిల్ ఆరోపించారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం బిజ్వారం గ్రామంలో పీడీఎస్యూ అర్థ శతాబ్ది ఉత్సవాల ( Golden Jubilee Celebrations ) సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి విద్య-వైజ్ఞానిక శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో వారు మాట్లాడారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యతో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని, విద్యార్థులకు అందాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. గురుకుల పాఠశాలలకు అవసరమైన భవనాల నిర్మాణం చేపట్టకపోవడం, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడం దురదృష్టకరమని వెల్లడించారు. నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలల కుదింపు పేరుతో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి కార్పొరేట్ విద్యాసంస్థలకు లాభం చేకూర్చే కుట్ర జరుగుతోందని విమర్శించారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 18 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
కార్యక్రమంలో పీడీఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహారావు, శివ ప్రసాద్, సహాయ కార్యదర్శులు గణేష్, అజయ్, సురేష్, దీక్షిత, వెంకటేష్, గర్ల్స్ కో కన్వీనర్ అనూష, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కృష్ణ, జిల్లా నాయకులు సలీం, కాళేశ్వర్, కాశీనాథ్, గోవర్ధన్ రెడ్డి, చంద్రాములు పాల్గొన్నారు.