Kishan Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు తెలంగాణ యువతను మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ వేస్తామని చెప్పారని, అట్టహాసంగా వార్తా పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. ఒకటో తేది దాటిపోయినా ఇంతవరకు నోటిఫికేషన్ ఊసేలేదని ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేయడంలో ఆ పార్టీకి ఘనమైన చరిత్ర ఉన్నదని పేర్కొన్నారు. ఇప్పుడు మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టిందని స్పష్టం చేశారు. ఇతర వాగ్దానాలనూ దాటవేసే ప్రయత్నమూ చేస్తున్నదని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ నెల 5 నుంచి 8 వరకు ‘గావ్ చలో, ఘర్ చలో’ కార్యక్రమం నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి, ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ ఆధ్వర్యంలో పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భం గా ఈ నెల 10 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రథయాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే రథయాత్రలు చేస్తే బాగుంటుందని లోక్సభ టికెట్ ఆశావహులు వినతిని, రాష్ట్ర నాయకత్వం పట్టించుకోలేదని సమాచారం. ఈ సందర్భం గా ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు అంకిరెడ్డి సుధీర్రెడ్డి, బొల్లపు సురేందర్రెడ్డి బీజేపీలో చేరారు.