పెద్దపల్లి, ఫిబ్రవరి 19: పెద్దపల్లి కాంగ్రెస్లో విభేదాలు భగ్గుమన్నాయి. పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి వచ్చిన చింతకుంట విజయరమణారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే ఎదుటే కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇద్దరు పరస్పరం తోసుకోగా, కార్యకర్తలు పిడిగుద్దులు గుద్దుకున్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీ కొనుగోలు చేసిన రెండు ట్రాక్టర్లను సోమవారం ప్రారంభించేందుకు ఎమ్మెల్యే వచ్చారు. కొబ్బరి కాయలు కొట్టే క్రమంలో కౌన్సిలర్లు కొలిపాక శ్రీనివాస్, నూగిళ్ల మల్లయ్య మధ్య తోపులాట జరిగింది. దీంతో మల్లయ్య.. శ్రీనివాస్ను పక్కకు జరుగమనడంతో ఇద్దరిమధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. పోలీసులు వారిని నిలువరించడంతో ఎమ్మెల్యే ట్రాక్టర్లను ప్రారంభించారు. అనంతరం బడ్జెట్ సమావేశం జరుగుతున్న సమయంలో కౌన్సిలర్ల అనుచరులు అక్కడికి చేరుకున్నారు. సమావేశ మందిరంలోకి వెళ్లి కొట్టుకున్నారు. ఎమ్మెల్యేతోపాటు కౌన్సిలర్ శ్రీనివాస్ బయటకు వచ్చి నూగిళ్ల మల్లయ్య అనుచరులు దాడి చేశారని ఆరోపించారు. ముదిరాజ్లను మున్నూరు కాపులు అణగదొక్కుతున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. గొడవ జరగుతుండగానే ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి అక్కడినుంచి పంపించారు. కౌన్సిలర్లు శ్రీనివాస్, మల్లయ్య పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.