Gandhi Bhavan | హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): దేశంలోనే సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీగా చెప్పుకుంటున్నా.. నియమాలు, నైతికత, సంస్కారాన్ని మర్చిపోవడం కాంగ్రెస్ పార్టీ నేతలకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. వారిలో వారు ఘర్షణలకు దిగడం, దాడులకు తెగబడటం, వర్గపోరుతో బహిరంగ వేదికలపైనే వాదులాడుకోవటం నిత్యకృత్యమైపోయింది. తమ పార్టీలో ఇదంతా అంతర్గత ప్రజాస్వామ్యం అని వారు ఎంత సర్దిచెప్పుకోవటానికి ప్రయత్నించినా.. సొంతపార్టీ కార్యాలయాలపై దాడులు, సొంత పార్టీ జెండాలనే తగలబెట్టుకోవటం చూసేవాళ్లకు ఏవగింపు కలిగిస్తున్నాయి. ప్రజా సమస్యలపై స్పందనలకంటే అంతర్గత ఘర్షణలతోనే ఆ పార్టీ మీడియాలో ప్రధానంగా కనిపిస్తున్నది.
గాంధీభవన్పై కాంగ్రెస్ క్యాడర్ దాడులు
కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గపోరుకు ఐకాన్గా చెప్పుకునే పరిస్థితి మొదటి నుంచి ఉన్నది. తెలంగాణ ఉద్యమం.. సమైక్య పాలకుల కాలంలోనూ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ అరుపులు, పెడబొబ్బలు, దాడులు, ఘర్షణలతో అట్టుడికేది. ఉదాహరణకు కొన్ని ఘటనలు..
మొదటి నుంచి అదే ధోరణి
కాంగ్రెస్ రక్తంలోనే ఇలాంటి ఘర్షణపూరిత లక్షణాలు ఉన్నాయని ఆ పార్టీ చరిత్ర తెలుసుకొంటే అర్థమవుతుంది. మొదట్లో భౌతిక దాడుల సంస్కృతి లేకున్నా.. రానురాను ఇలాంటి సంస్కృతికి కాంగ్రెస్ నేతలు, వారిని వెన్నంటి ఉండే కార్యకర్తలు అలవాటు చేసుకొన్నారు. పార్టీ విలువలకు కట్టుబడి ఉన్నవారికి కాకుండా.. రౌడీయిజం, దౌర్జన్యం, డబ్బులకు అమ్ముడుపోవడం, టిక్కెట్లు అమ్ముకొనేవారికి ప్రాధాన్యం ఇవ్వడంతో అందరూ అదేబాట పట్టారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పార్టీ అంతర్గత సమావేశాలైనా, ఇతరత్రా భేటీలైనా వర్గపోరు లేకుండా నిర్వహించడం ఎన్నడూ చూడలేదని కాంగ్రెస్ నేతలే వాపోతున్నారు. ఎన్నికల సమయంలో టికెట్లు అమ్ముకోవటం సాధారణ విషయంగా మారిందని చెప్తున్నారు. అందువల్లనే అసంతృప్తి పెరిగి ఘర్షణలు జరుగుతున్నాయని అంటున్నారు.