హైదరాబాద్/నల్లగొండ, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): చైతన్యానికి మారుపేరైన మునుగోడు గడ్డ మీద కాషాయ పార్టీని కాలుపెట్టనివ్వబోమని ఇటు కాంగ్రెస్ శ్రేణులు, అటు తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి అనుచరులు శపథం చేస్తున్నారు. స్వార్థంతో పార్టీని వీడటమే కాకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తమను మధ్యలో వదిలేసిన రాజగోపాల్రెడ్డికి తగిన బుద్ధి చెప్తామని ప్రతిన బూనుతున్నారు. ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధులు రాజగోపాల్ పేరు చెప్తేనే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. త్వరలో జరుగనున్న ఉపఎన్నికలో బీజేపీ తరఫున బరిలోకి దిగాలని భావిస్తున్న రాజగోపాల్ను ఓడించడం తమకు కాంగ్రెస్లో ఉంటే సాధ్యం కాదని, విస్తృత ప్రజాబలం, పార్టీ బలం ఉన్న టీఆర్ఎస్తోనే అది సాధ్యమని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ దిశలోనే ఇప్పటికే పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు గులాబీ పార్టీలో చేరిపోగా, ఇంకా చాలామంది ప్రజాప్రతినిధులు కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఇన్నాళ్లు మాయమాటలు చెప్పి మోసం చేశాడు.. ఉన్నపళంగా మాతో మాట వరుసకైనా చెప్పకుండా రాత్రిరాత్రికే ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. మళ్లీ ఏ మొహం పెట్టుకొని నియోజకవర్గానికి వస్తాడో చూస్తాం’ అని కాంగ్రెస్ స్థానిక ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. రాజగోపాల్ తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించినప్పటి నుంచి మునుగోడు నియోజకవర్గంలో సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీల నుంచి కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు భారీ ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇన్నాళ్లు అసమర్థ ఎమ్మెల్యే నమ్ముకొని తమను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేశామని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
మునుగోడు నుంచి బీజేపీని తరిమికొట్టుడే
స్వార్థమే పరమావధిగా రాజకీయం చేసిన రాజగోపాల్ బీజేపీలో చేరి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని చూస్తున్నాడని కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. మొదటి నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రత్యేకించి మునుగోడు నియోజకవర్గం చైతన్యానికి మారుపేరుగా ఉన్నదని, ఇటువంటి గడ్డ మీద మతత్వాన్ని రెచ్చగొడుతూ, కులాల కుంపట్లు రాజేసే బీజేపీని తరిమికొడ్తామని స్థానికులు పేర్కొంటున్నారు. ఒకవైపు కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు, మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు కదనకుతూహలాన్ని ప్రదర్శిస్తున్నాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని ఇటువంటి తరుణంలో తాము ఇంకా ఆ పార్టీలో ఉంటే ప్రయోజనం లేదని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
బీజేపీని ఎదుర్కొనే సత్తా ఉన్న టీఆర్ఎస్లో చేరటం ద్వారానే తమ కలలు సాకారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. గత నెల 24 నుంచి మునుగోడు నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున గులాబీ కండువా కప్పుకొంటున్నారు. తాజాగా నల్లగొండలో సోమవారం మంత్రి జగదీశ్రెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో మునుగోడు ఎంపీటీసీ బొడ్డు శ్రావణి నాగరాజు, నారాయణపురం మండలం కొత్తగూడెం సర్పంచ్ దోనూరు సుశీల, చండూరు మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యురాలు ఖైరూబేగం టీఆర్ఎస్లో చేరారు.
కార్యక్రమంలో జడ్పీచైర్మన్లు బండా నరేందర్రెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డి, ఎంపీపీ నరేందర్రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు హైదరాబాద్లో ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, సిరికొండ మధుసూదనాచారి సమక్షంలో కుంట్లగూడెం సర్పంచ్ మిర్యాల పారిజాత టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లోకి వస్తున్న ఆ పార్టీ శ్రేణులను, స్థానిక ప్రజాప్రతినిధులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని, అభివృద్ధికి అండగా ఉంటామని మంత్రి జగదీశ్రెడ్డి, పార్టీ ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ భరోసా ఇస్తున్నారు.
20న ప్రజాదీవెన సభనాటికి భారీ చేరికలు
టీఆర్ఎస్ ఈ నెల 20న మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజాదీవెన సభ నాటికి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అవుతుందని ఆ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. తమ నియోజకవర్గానికి ఇంతకాలం అసమర్థ ఎమ్మెల్యే ఉన్నారని వారు అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాల ఫ్లోరోసిస్ను మిషన్ భగీరథతో తరిమివేసిన అపరభగీరథుడు సీఎం కేసీఆరేనని నియోజకర్గం బలంగా నమ్ముతున్నదని కాంగ్రెస్ నేతలు పేర్కొనడం గమనార్హం.