హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి రావడానికి కూటముల పేర్లు మార్చుకొని ముందుకు వస్తున్నాయని, వాటితో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి విమర్శించారు. 75 ఏండ్లుగా పాలిస్తున్న ఈ జాతీయ పార్టీలు దేశ ప్రజలకు కనీస అవసరాలైన సాగు, తాగునీరు, కరెంట్ను అందించలేకపోయిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నదని మంగళవారం ఒక ప్రకటనలో ఆవేదన చెందారు. ఇప్పుడు గెలిచే సత్తాలేక కూటముల పేరిట పేర్లు మార్చుకొని మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నాయని విమర్శించారు. కానీ 9 ఏండ్ల కేసీఆర్ దార్శనిక పరిపాలనలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని కొనియాడారు. సురక్షిత తాగునీరు, రైతు కోసం సాగునీరు, రాష్ట్ర ప్రగతి కోసం విద్యుత్తు అందించి జాతీయ పార్టీలకు అభివృద్ధి అంటే ఏమిటో చేతలతో చూపుతున్నారని వివరించారు. యావత్ దేశ ప్రజలు సైతం తెలంగాణ తరహా ప్రగతిని కోరుకుంటుందని తెలిపారు.