యాదాద్రి, ఆగస్టు 15: శ్రావణ సోమవారంతోపాటు వరుస సెలవులు రావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. ఒక్కరోజే 35 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకొన్నట్లు అర్చకులు తెలిపారు. ధర్మదర్శనానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి ఉద యం ఆరగింపు చేపట్టారు.
స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం శ్రీసుదర్శన నారసింహహోమం జరిపారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా జరిపారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవల్లో భక్తులు పాల్గొని తరించారు. శ్రీవారి ఖజానాకు రూ.33,41,497 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్ గీత తెలిపారు.