Ration Shops | హైదరాబాద్, మార్చి 23(నమస్తే తెలంగాణ): పౌరసరఫరాల శాఖ నిర్ణయంతో రేషన్ పంపిణీలో గందరగోళం నెలకొన్నది. గతంలో ప్రతినెలా 3 లేదా 5 నుంచి ప్రారంభించి 23 నుంచి 25 వరకు దుకాణాల్లో సరుకులను పంపిణీ చేసేవారు. అవసరాన్ని బట్టి గడువును పొడిగించేవారు. ఈ మార్చి నెల నుంచి పంపిణీ తేదీల్లో పౌరసరఫరాల శాఖ మార్పులు చేసింది. ఒకటో తేదీన ప్రారంభించి 15 వరకే పంపిణీ ముగించాలని అన్ని జిల్లాలకు సర్క్యులర్ జారీ చేసింది.
అయితే సరుకుల పంపిణీ గడువు కుదించారనే విషయం ప్రజలకు చేరలేదు. కేవలం అంతర్గతంగా సర్క్యులర్ జారీ చేసిన అధికారులు ప్రజలకు అవగాహన కల్పించలేదు. దీంతో తెల్ల రేషన్కార్డుదారులు గతంలో మాదిరిగా 15 తర్వాత కూడా రేషన్ షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. భారీ సంఖ్యలో కార్డుదారులు వస్తుండటంతో డీలర్ల విజ్ఞప్తి మేరకు అతికష్టంపై రెండు రోజుల గడువు పొడిగించిన అధికారులు ఆ తర్వాత ముగించేశారు.
ఈ విషయం తెలియని లబ్ధిదారులు రేషన్ షాపులకు వస్తూనే ఉన్నారు. పౌరసరఫరాల శాఖ గడువు కుదింపు నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మందికి పైగా లబ్ధిదారుల కుటుంబాలు బియ్యంతోపాటు ఇతర రేషన్ సరుకులు తీసుకోలేదని తెలిసింది. ఇక నుంచి వరుసగా 15 రోజులపాటు ఎలాంటి సెలవులు లేకుండా బియ్యం పంపిణీ చేయాలన్న ఆదేశాలపై రేషన్ డీలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.