హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరించే పోలీసులంటే.. కర్కశ గుణం గలవారు అన్న భావనే చాలా మందిలో గూడుకట్టుకొని ఉంటుంది. కానీ.. వారు కూడా మనసున్న మారాజులేనని, దాతృత్వాన్ని చాటడంలో వారూ ముందుంటారన్న విషయం ఎంత మందికి తెలుసు? ఔను, ఖాకీల్లోనూ మానవత్వం మూర్తీభవించి ఉంటుందన్న సంగతి మరోమారు రుజువైంది! కలిసి పనిచేసిన పోలీసు అనుకోకుండా జీవితాన్ని ముగించగా సహచరులు అతని స్నేహాన్ని ‘యాది’ మరువలేకపోయారు. సాయం చేయకుండా ఉండలేకపోయారు.
గుండెపోటుతో మృతిచెందిన ఓ కానిస్టేబుల్ కుటుంబానికి తోటి ఉద్యోగులు అండగా నిలిచారు. వివరాలివీ.. పర్మగల్ల యాదయ్య 2007లో ఏఆర్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరాడు. తర్వాత 2011లో సివిల్ కానిస్టేబుల్గా ఎంపికై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ఠాణా ల్లో విధులు నిర్వర్తించాడు. యాదయ్య మా దాపూర్ పీఎస్లో విధులు నిర్వర్తిస్తుండగా గత ఆగస్టు 8న అర్ధరాత్రి గుండెపోటుతో చనిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తోటి ఉద్యోగులు, తన బ్యాచ్కు చెందిన కానిస్టేబుళ్లు యాదయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు.
మాదాపూర్ ఠాణా సిబ్బందితోపాటు సైబరాబాద్, రాచకొండ, కరీంనగర్లో పనిచేస్తున్న 2011 బ్యాచ్ కానిస్టేబుళ్లంతా కలిసి రూ.15 లక్షలు విరాళాలు సేకరించారు. శంషాబాద్ దగ్గరలోని పెద్ద షాపూర్లో యాదయ్య పిల్లల పేరిట 200 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి చేతుల మీదుగా యాదయ్య కుటుంబానికి డాక్యుమెంట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ జీ వినీత్, ఇన్స్పెక్టర్ మల్లేశ్, సిబ్బంది పాల్గొన్నారు.