నల్లగొండ ప్రతినిధి, మార్చి 20 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు, సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (91) ఆఖరి మజిలీలోనూ ఆదర్శంగా నిలిచారు. మరణానంతరం తన మృతదేహాన్ని ఖననం చేయవద్దని, ఏదైనా మెడికల్ కాలేజీకి పరిశోధన నిమిత్తం ఇవ్వాలన్న ఆమె చివరి కోరికను కుటుంబ సభ్యుల అంగీకారంతో పార్టీ నేతలు నెరవేర్చారు. నల్లగొండలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఆదివారం ఆమె పార్థివదేహాన్ని అప్పగించారు. ఉదయం హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. అక్కడ వివిధ పార్టీల నేతలు, అభిమానులు నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక వాహనంలో నల్లగొండకు తరలించారు. చౌటుప్పల్, చిట్యాల తదితర చోట్ల అభిమానులు నివాళులర్పించారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో నల్లగొండలోని పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించారు. పార్టీలకతీతంగా తరలివచ్చిన నాయకులు ఆమెకు నివాళులర్పించారు.
ప్రముఖుల నివాళి
మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు జగదీశ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు పార్టీల నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భం గా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడు తూ.. చివరివరకూ పేదల సేవకు పరితపించి, ప్రజల గుండెల్లో పదిలంగా నిలిచిన వ్యక్తి మల్లు స్వరాజ్యం అని కొనియాడారు. స్వరాజ్యం మరణం ప్రజాఉద్యమాలకు, పీడిత ప్రజల పోరాటాలకు ఎంతోలోటు అని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఎన్నో పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన మల్లు స్వరాజ్యం పేరుతో పుస్తకాలు, సినిమాలు రావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆకాంక్షించారు. తమలాంటి ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చిన మహనీయురాలు మల్లు స్వరాజ్యం అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొనియాడారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కమ్యూనిస్టు కంచుకంఠం మాయమైందని, నిజాంకు, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నారు. గొప్ప ఉద్యమకారిణిని వామపక్ష ఉద్యమం కోల్పోయిందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. దేశంలోని మహిళా పోరాటాలకే స్వరాజ్యం ఓ ఐకాన్ లాంటి వారంటూ ఐద్వా జాతీయ నేత సుభాషిణి అలీ పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీకి పార్థివదేహం
మల్లు స్వరాజ్యం పార్థివదేహాన్ని నల్లగొండలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అప్పగించారు. ఆమె కోరిక మేరకే మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగిస్తున్నట్టు స్వరాజ్యం చిన్న కోడలు, ఐద్వా రాష్ట్ర నేత మల్లు లక్ష్మి వెల్లడించారు. నల్లగొండలోని సీపీఎం కార్యాలయం నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీ వరకు స్వరాజ్యం పార్థ్ధివదేహంతో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా తరలివెళ్లాయి.