Union Budget | హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కొత్తవాటిపై కోటి ఆశలు పెట్టుకున్న వారిపై కేంద్రం అప్పడే నీళ్లుచల్లింది. సమగ్రశిక్ష ప్రాజెక్ట్ (ఎస్ఎస్ఏ) బడ్జెట్ను పెంచబోమని ముందే చేతులెత్తేసింది. ఈ ప్రాజెక్ట్కు బడ్జెట్లో కొత్త ప్రాతిపాదనలు చేర్చకండి.. తామైతే ఇవ్వలేమని తేల్చేసింది. ఫలితంగా పాఠశాల విద్యలో మౌలిక వసతుల కల్పనకు చేపట్టే ఈ ప్రాజెక్ట్కు నిధుల సమస్య తలెత్తింది. 2024-25 విద్యాసంవత్సరానికి ఎస్ఎస్ఏ బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని కేంద్రం ఇటీవలే రాష్ట్ర విద్యాశాఖకు సూచించింది. రాష్ట్ర అధికారులు ఈ పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఈ సారికి పాత బడ్జెట్ ప్రతిపాదనలే సమర్పించాలని, కొత్త ప్రతిపాదనలొద్దని కేంద్రం మెలికపెట్టింది. దీంతో ఈ ఏడాది రూ.1,900 కోట్లకే అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. గతంలో ఈ ప్రాజెక్ట్లో ఏటా 20 శాతం పెంచుకునేందుకు అవకాశం ఉండేది. కానీ కేంద్రం ఈ అవకాశం లేకుండా చేసింది.
సమగ్రశిక్ష ప్రాజెక్ట్ నిధులు సిబ్బంది జీతాలు, డైట్చార్జీలకే అన్నట్టు తయారైంది. ప్రతి నెల కేజీబీవీ, సమగ్రశిక్ష సిబ్బందికి వేతనాల చెల్లింపునకు రూ.35 కోట్లు, కేజీబీవీ డైట్ చార్జీలుగా రూ.20 కోట్ల అవసరం అవుతున్నాయి. వీటి చెల్లింపులకే విద్యాశాఖ ఆపసోపాలు పడుతున్నది. ఇదిలా ఉండగా రాష్ట్ర వాటా నిధులను ఇస్తేనే తామూ ఇస్తామని కేంద్రం మెలికపెడుతున్నది. గతంలో ఇలాంటి సంప్రదాయం ఉండేది కాదు. కేంద్రం తన వాటాను తప్పనిసరిగా ఇచ్చేది. గతంలో రాష్ట్ర వాటాతో నిమిత్తం లేకుండా ఆమోదిత బడ్జెట్లో 75 శాతం నిధులను కేంద్రం విడుదల చేసేది. కొంత కాలానికి మిగిలిన 25 శాతం నిధులిచ్చేది. తర్వాత దీన్ని 50:50కి మార్చింది. గత ఏడాది కేంద్ర వాటా నిధులను నాలుగు విడతలుగా విభజించింది. తొలుత మొదటి విడత నిధులను విడుదల చేస్తున్న కేంద్రం.. రాష్ట్రం తన వాటా విడుదల చేశాకే రెండో విడతను విడుదల చేస్తున్నది. దీంతో గత ఏడాది రూ.1,913 కోట్లకు ఆమోదం లభిస్తే రూ.1,500కోట్లకు పైగా నిధులు అందని పరిస్థితి నెలకొన్నది. 20 శాతం నిధులు పెంచుకొనే అవకాశం లేకపోవటంతో ఏడేండ్లుగా ఎస్ఎస్ఏ ఆమోదిత బడ్జెట్ తగ్గుతూ వస్తున్నది.