హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలోని బీసీ ప్రజల విశాల ప్రయోజనాల నిమిత్తం రిజర్వేషన్ల స్థిరీకరణపై హేతుబద్ధమైన, ఆచరణ యోగ్యమైన సిఫార్సులతో ప్రభుత్వానికి నివేదిక అందజేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ, తదితర అంశాలపై అధ్యయనం కోసం వివిధ రాష్ర్టాలతో విస్తృత చర్చలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. గత నాలుగు రోజులుగా మధ్యప్రదేశ్లో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ బృందం చివరిరోజైన శుక్రవారం ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, బీసీ, మైనార్టీ, సామాజిక న్యాయశాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమైంది.
పంచాయతీరాజ్ ఎన్నికల చట్ట సవరణలు, మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, అందుకు ఉపయోగిస్తున్న మార్గదర్శకాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం వల్లే తమ అధ్యయనం సమగ్రంగా కొనసాగుతున్నదని తెలిపారు. మరో రెండు రాష్ట్రాల్లోనూ తమ కమిషన్ పర్యటించి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర, శుభప్రద్పటేల్ నూలి, కిశోర్గౌడ్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, మధ్యప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి ఉమాకాంత ఉమారావు, డైరెక్టర్ అలోక్కుమార్ సింగ్, బీసీ సంక్షేమం, మైనార్టీశాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ బర్నవాల్, కమిషనర్ గోపాల్ దాడ్, బీసీ సంక్షేమ కమిషన్ సభ్య కార్యదర్శి లతాశరణ్ ఘాట్, న్యాయనిపుణులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు.