చలివాగు కింద దేవాదుల సొరంగం పూర్తి
ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం
శాయంపేట, ఏప్రిల్ 15: వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల పరిధిలోని చలివాగు ప్రాజెక్టు కింద నుంచి చేపట్టిన దేవాదుల సొరంగం పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. పదేండ్ల క్రితం పనులు ప్రారంభించగా, బుంగ పడి ఆటంకాలు ఎదురయ్యాయి. ఎన్నో ఆటుపోట్ల నడుమ తెలంగాణ సర్కారు బుంగను పూడ్చి వేసింది. సొరంగం పనులు పూర్తికావడం తో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో దశ పనుల్లో భాగంగా శాయంపేట మండలం జోగంపల్లి శివారులో ఉన్న చలివాగు ప్రాజెక్టు కింద నుంచి సొరంగం పనులు చేపట్టారు. రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు సుమారు 49 కిలోమీటర్ల భూగర్భ సొరంగం పనులను రూ.1,494 కోట్లతో 2008లో మొదలు పెట్టారు. 2011 జూలై 15న రాత్రి వేళ చలివాగులో బుంగపడి సొరంగంలోకి నీళ్లు చొచ్చుకెళ్లాయి. దీంతో ముగ్గురు కార్మికులు జలసమాధి అయ్యారు. ఐదేండ్లపాటు పనులు నిలిచిపోయాయి. బుంగను జియాలజిస్టులు, శాస్త్రవేత్తల సాయంతో గుర్తించారు. తిరిగి 2016లో తెలంగాణ సర్కారు సొరంగం పనులను మొదలు పెట్టింది. బుంగను పూడ్చడంతోపాటు సొరంగం తవ్వకం క్లిష్టతరంగా మారినా అధికారులు తీవ్రంగా కృషి చేశారు.
ఈ క్రమంలో గత ఆగస్టు నెలలో చలివాగు కింద సొరంగం తవ్వకం పనులను పూర్తి చేయడంతో మహా ఘట్టం పూర్తయింది. బుంగ పడిన తర్వాత 600 మీటర్ల సొరంగాన్ని అత్యంత భద్రతా చర్యల మధ్య తవ్వి అనుసంధానం చేశారు. చలివాగు కింద లైనింగ్కు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రైల్వే ట్రాక్కు వినియోగించే అతిపెద్ద ఇనుప కడ్డీలతో రిబ్బులను పెట్టి ఫీటు ఐదు ఇంచుల కాంక్రిట్ను వేసి లైనింగ్ చేశారు. సుమారు 36 సెంటీమీటర్లతో భవిష్యత్లో ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునేలా లైనింగ్ చేపట్టడం విశేషం. సొరంగం, లైనింగ్ పనులు పూర్తికావడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. కాగా మే నెలాఖరుకు మూడో దశ దేవాదుల సొరంగం పనులు పూర్తి కానున్నాయి. మొదటి, రెండో దశతో పోల్చితే మూడో దశ కీలకమని అధికారులు తెలిపారు.