హైదరాబాద్ : నాలుగు వారాల్లోగా తెలంగాణకు పూర్తిస్థాయి డీజీపీ నియామకం పూర్తిచేయాలని యుపీఎస్సీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. డీజీపీ నియామకానికి యూపీఎస్సీ అత్యవసరంగా సిఫార్సులు చేయాల్సిందేనని ఆదేశించింది. అర్హత కలిగిన అధికారుల జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో వారి పరస్పర ప్రతిభ (ఇంటర్-సే మెరిట్) ఆధారంగా ఎంపిక జరగాలని పేర్కొంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి యూపీఎస్సీకి అదనంగా నాలుగు వారాల గడువు ఇస్తున్నట్లు తెలిపింది.
తెలంగాణ ఒక్కటే కాదని, ప్రకాష్ సింగ్ తీర్పును పట్టించుకోకుండా డీజీపీ నియామకానికి ప్రతిపాదనలు పంపని రాష్ట్రాలు మరికొన్ని ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. రెగ్యులర్ డీజీపీ స్థానంలో యాక్టింగ్ లేదా అడ్హాక్ డీజీపీలను నియమించే విధానం పెరిగిందని, దాంతో ఆలస్యంవల్ల అర్హత కలిగిన సీనియర్ అధికారులకు అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడింది. డీజీపీ నియామకానికి సంబంధించి రాష్ట్రాలు సమయానికి ప్రతిపాదనలు పంపేలా వారికి లేఖ రాసేందుకు యూపీఎస్సీకి అధికారం ఇస్తున్నామని తెలిపింది.
రాష్ట్రాలు స్పందించకపోతే ప్రకాష్ సింగ్ కేసులో యూపీఎస్సీ దరఖాస్తు దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అవసరమైతే సంబంధిత రాష్ట్రాలపై బాధ్యత, జవాబుదారీతనంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొంత మేరకు సవరించింది.