Chinta Prabhakar | ఒకప్పుడు ఆయన ట్రేడ్ యూనియన్ నాయకుడు. కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారు. మున్సిపల్ చైర్మన్గా విజయదుందుభి మోగించారు. నిత్యం జనం మధ్యనే ఉంటారు. ప్రతిరోజూ తన నివాసానికి వచ్చే ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తారు. సమస్యలు అడిగి తెలుసుకుంటారు. వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతూ అందరిచే శభాష్ అనిపించుకుంటున్నారు హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్.
చింతా ప్రభాకర్ది సామాన్య మధ్యతరగతి కుటుంబం. 25 ఏండ్ల క్రితమే ట్రేడ్ యూనియన్లో అడుగు పెట్టారు. స్పిన్నింగ్ మిల్లు యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. కార్మికుల పక్షాన పోరాటాలు చేశారు. వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. 1995లో సదాశివపేట మున్సిపల్ చైర్మన్గా విజయదుందుభి మోగించారు. కార్మిక నేత, మున్సిపల్ చైర్మన్గా జనం మధ్యనే ఉంటున్న చింతా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ప్రజలతో కలిసి ఎన్నో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2012లో ఉద్యమ సారథి కేసీఆర్ సదాశివపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలోనే ప్రభాకర్ గులాబీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి ఉద్యమంలో పాల్గొంటూ తనదైన శైలిలో ప్రజలకు చేరువయ్యారు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. 2014లో ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ప్రజల మధ్యనే ఉంటున్న చింతా ప్రభాకర్ను సీఎం కేసీఆర్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు.
గెలిచినా.. ఓడినా.. ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు ప్రభాకర్. ఎమ్మెల్యేగా లేనప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. సంగారెడ్డికి మెడికల్, నర్సింగ్, లా కాలేజీలు మంజూరు చేయించారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచారు. బాధితుల వివరాలు తెలుసుకొని వారికి కావలసిన నిత్యావసర వస్తువులు, మందులు పంపిణీ చేశారు. ఎన్నికల్లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరఫున పోటీలో ఉన్నారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు.