హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలో హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడుతున్నారని, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతోపాటు, స్టార్ క్యాంపెయినర్గా తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తిచేసింది. కాంగ్రెస్ చట్టాన్ని ఉల్లంఘించి సామాజిక మాధ్యమాల అసత్యాలను ద్వారా ప్రచారం చేస్తున్నదని ఆరోపించింది. ఈ మేరకు బీఆర్కేఆర్ భవన్లో సోమవారం ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్కుమార్, పార్టీ లీగల్ సెల్ నాయకులు రవికుమార్, లలితారెడ్డి, వేణుగోపాల్రావు, మధుసూదన్రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో భరత్కుమార్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నదని, చట్టాన్ని, ఎన్నికల సంఘాన్ని కూడా బేఖాతరు చేస్తున్నదని ఆరోపించారు.
తెర వెనుక సునీల్ కనుగోలు
కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాంటి అనుమతులు లేకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని, దొంగ చానళ్ల ముసుగులో కొందరు బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నారని భరత్కుమార్ చెప్పారు. ఇలాంటివి 28 యూట్యూబ్ చానళ్ల వివరాలను ఈసీకి ఇచ్చామని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, ఉద్దేశ పూర్వకంగా, బీఆర్ఎస్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ తెరవెనుక ఉండే సునీల్ కనుగోలు లాంటి వ్యక్తులు ఇటువంటి చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతున్నారని, సునీల్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. క్యూ న్యూస్ చానల్ కాంగ్రెస్కు నేరుగా ప్రచారం చేస్తున్నదని, దానిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరామని అన్నారు. స్టడీఐక్యూ, ఐఏఎస్ యూట్యూబ్ చానల్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తున్నదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎలాంటి ఆధారాలు లేకుండా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఈ కథనాన్ని తొలగించాలని, ఆ కథనానికి అయిన వ్యయాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖర్చులో చేర్చాలని కోరారు.
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు
రేవంత్రెడ్డిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని సోమ భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, తెలంగాణ సంసృతిని అవమానపరిచే భాష మాట్లాడుతున్నారని చెప్పారు. ఎన్నికలంటే హింసను రెచ్చగొట్టడమేనా? తొమ్మిదిన్నరేండ్లలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా? అని భరత్కుమార్ ప్రశ్నించారు. రేవంత్ వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉన్నదని, ఆయన మాటలకు కాంగ్రెస్ కార్యకర్తలు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఈసీని గతంలోనే కోరామని గుర్తుచేశారు. కాంగ్రెస్ హింసను బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఆయన స్పష్టం చేశారు. సీఈవో వికాస్రాజ్కు అన్ని విషయాలు వివరంగా చెప్పామని, వెంటనే చర్యలు తీసుకోపోతే వ్యవస్థ అరాచక శక్తుల చేతుల్లోకి పోతుందని కూడా విన్నవించామని తెలిపారు. నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని సీఈవో హామీ ఇచ్చారని తెలిపారు.