హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ఖాకీ పోస్టులకు అన్ని క్యాటగిరీల్లోనూ తీవ్ర పోటీ నెలకొన్నది. ఓపెన్, బీసీ క్యాటగిరీలతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీల్లోనే పోటీ అధికంగా ఉన్నది. శుక్రవారం వెలువడిన ఎస్సై, కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు ఈ విషయాన్ని నిర్ధారించాయి. పోలీస్ నియామక మండలి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎస్సై పోస్టులకు పోటీపడుతున్న వారిలో అత్యధికంగా ఎస్టీ క్యాటగిరీ నుంచే 59.12 శాతం మంది ఫిజికల్ ఈవెంట్స్కు అర్హత సాధించారు.
ఈ క్యాటగిరీ నుంచి ఎస్సై ఉద్యోగానికి మొత్తం 38,180 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 22,571 మంది తర్వాతి దశకు అర్హత సాధించారు. అదేవిధంగా వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు ఎస్సీ క్యాటగిరీలోనే పోటీ ఎక్కువగా ఉన్నది. ఈ క్యాటగిరీ నుంచి మొత్తం 1,31,644 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 51,912 మంది అభ్యర్థులు (39.43 శాతం మంది) తర్వాతి దశకు అర్హత సాధించారు.