నర్సంపేట, జనవరి 18: ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంతో బీమా కంపెనీలకే రూ.400 కోట్లు లాభం చేకూరిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా చేసి ఉంటే నష్టం జరిగేది కాదని తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల మాటలను నమ్మొద్దని రైతులకు విజ్ఞప్తిచేశారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా సొమ్మును కంపెనీలకు చెల్లించాయని చెప్పారు. దీనివల్ల కంపెనీలకే 400 కోట్లు మేలు జరిగిందే తప్ప రైతులకు ఒరిగింది ఏమీ లేదన్నారు. కొంతమంది అవగాహన లేక ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి పసల్ బీమాలో రైతు, రాష్ట్రం, కేంద్రాల కంట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పారు. ఏదైనా విపత్తు జరిగినప్పుడు 40 శాతం ఏరియాలో నష్టం జరిగితేనే రైతులకు డబ్బులు వస్తాయని పేర్కొన్నారు. బీమా సంస్థలకు మనం చెల్లించింది, బీమా సంస్థలు రైతులకు చెల్లించింది పోను బీమా సంస్థలకే అదనంగా రూ.400 కోట్లు మిగిలాయని గుర్తుచేశారు. ఈ కారణంగానే అనేక రాష్ర్టాలు ఈ పథకం నుంచి వైదొలిగాయని, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ కూడా తప్పుకున్నదని తెలిపారు. వర్షాల వల్ల జరిగిన నష్టంపై సర్వేను పూర్తి చేసి నివేదికలను సకాలంలో అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.