హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ‘మీ పిల్లలు దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేకపోతున్నారా? పుస్తకాలను చదవడంలోనూ ఇబ్బంది పడుతున్నారా? అయితే వారు ‘మయోపియా’ (హస్వ దృష్టి) బారిన పడ్డారేమోనని అనుమానించండి. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో చిన్నపిల్లలు ఎక్కవ సమయం స్మార్ట్ఫోన్తోనే గడుపుతున్నారు. గంటలపాటు ఆన్లైన్ గేమ్స్, యూట్యూబ్ వీడియోలు అంటూ స్క్రీన్పై నుంచి కండ్లను పక్కకు తీయడంలేదు. ఆన్లైన్ క్లాసులకూ మొబైల్ ఫోన్ను వాడం తప్పనిసరైంది. దీంతో చిన్నారుల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో 2050 నాటికి దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10 మంది పిల్లల్లో ఐదుగురికి (48%) మయోపియా వచ్చే అవకాశం అధికంగా ఉన్నట్టు తేలింది. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మందిపై దీని ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. దీన్ని తొలిదశలోనే గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్నాళ్లకు పూర్తిగా కంటిచూపు సైతం పోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు సూర్యకాంతికి దూరంగా ఉండటం, నిద్రలేమి, పోషకాహార లోపం వంటి పరిస్థితులు కూడా మయోపియాకు దారితీస్తాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. చిన్న వయసులోనే మయోపియాకు గురైన పిల్లల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందని, దాదాపు 4% భారతీయ మయోపియా రోగులకు శాశ్వతంగా చూపు పోయే ప్రమాదం ఉన్నదని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ, చైల్డ్ సైట్ ఇన్స్టిట్యూట్ అధిపతి డాక్టర్ రమేశ్ కెకున్నయ, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ ఇన్ఫోర్ మయోపియా కేంద్రం అధిపతి డాక్టర్ పవన్ వెంకిచెర్ల తెలిపారు. మయోపియా ఉన్న చిన్నపిల్లలు చూపు అస్పష్టంగా ఉన్నదని తమంతట తాము చెప్పలేనందున వారికి వార్షిక కంటిపరీక్షలు చేయించడం తప్పనిసరి అని వారు సూచించారు.