హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 15 యూనివర్సిటీల్లోని బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి ‘తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు’ బిల్లును ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఈ బిల్లును సోమవారం అసెంబ్లీకి సమర్పించారు. ఈ బిల్లు రాష్ట్రమంతటికీ వర్తిస్తుందని, వెంటనే అమల్లోకి వస్తుందని బిల్లులో పేర్కొన్నారు. యూజీసీ సహా ఇతర సంస్థ లు జారీచేసిన మార్గదర్శకాల ప్రకారమే నియామకాలు జరుగుతాయని బిల్లులో ప్రభుత్వం ప్రకటించింది.
బోర్డు పరిధిలోకి వచ్చే వర్సిటీలు
ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన, మహత్మాగాంధీ, తెలంగాణ, తెలంగాణ మహిళా వర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్, పీవీ నర్సింహారావు వెటర్నరీ, కొండా లక్ష్మణ్బాపూజీ హార్టికల్చర్, ఆర్జీయూకేటీ, జేఎన్టీయూ, జేఎన్ఏఎఫ్ఏయూ యూనివర్సిటీలు బోర్డు పరిధిలో ఉన్నాయి.
బిల్లు స్వరూపం
బోర్డుకు ఒక చైర్పర్సన్, నలుగురు సభ్యులు ఉంటారు. పదవిరీత్యా ఉన్నత విద్యామండలి చైర్మన్ ఉమ్మడి నియామక బోర్డుకు సైతం చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇప్పటికే ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి చైర్మన్గా వ్యవహరిస్తుండగా, విద్యాశాఖ, జీడీఏ, ఆర్థికశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉండగా, కళాశాల విద్య, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు.