హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): బస్సు ఎక్కితే ఒక టికెట్.. మెట్రో ఎక్కితే మరో టికెట్.. ఎంఎంటీఎస్ ఎక్కితే ఇంకో టికెట్.. ఇలా కాకుండా, అన్నింటికీ ఒకే టికెట్ ఉంటే ఎంత బాగుండు! అనుకునేవారెందరో. వారికోసం రాష్ట్ర ప్రభు త్వం వినూత్న ఆలోచన చేసింది. ప్రజారవాణా వ్యవస్థ మొత్తానికి ఉపయోగపడేలా కామన్ మొబిలిటీ కార్డును అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్, టీఎస్ఆర్టీసీ కార్యాచరణ ప్రారంభించాయి. ఈ రెండు వ్యవస్థల్లో ఉపయోగించుకొనేలా కార్డును రూపొందించనున్నారు. గురువారం సచివాయంలో మంత్రులు కే తారకరామారావు, పువ్వాడ అజయ్కుమార్, శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఆర్టీసీ, మెట్రో రైల్ సంస్థల ఉన్నతాధికారులు కార్డుకు సంబంధించిన పలు వివరాలను అందించారు.
కార్డు జారీ ప్రక్రియ మొదలు ప్రజలకు అందుబాటులో ఉండే సేవల వివరాలను వెల్లడించారు. ముందు మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ఈ కార్డుతో ప్రయాణించవచ్చని, భవిష్యత్తులో దీన్ని ఎంఎంటీఎస్, క్యాబ్స్, ఆటోలకు వినియోగించుకొనేలా విస్తరిస్తామని మంత్రు లు తెలిపారు. దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వినియోగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోట వినియోగించుకొనే అవకాశం ఉంటుందని వివరించారు. ఆగస్టు రెండో వారంలో హైదరాబాద్ పౌరులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నించాలని అధికారులకు స్పష్టం చేశారు. నగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కార్డు సేవలు అందించేలా లక్ష్యం పెట్టుకోవాలని ఆదేశించారు. ఈ కామన్ మొబిలిటీ కార్డుకు ఒక పేరును సూచించాలని కోరారు. ఈ మేరకు పేర్లు సూచించాలని ప్రజలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ విన్నవించారు. సమీక్షలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.