Farmers | హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): తొలకరి చినుకులు మరో రెండు మూడు రోజుల్లో రాష్ర్టాన్ని పలకరించనుండటంతో రైతులు పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ వానకాలం సీజన్లో మొత్తం 1.51 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. ఇందులో 1.40 కోట్ల ఎకరాల్లో సాధారణ పంటలు, మరో 11 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతాయని పేర్కొన్నది. తదనుగుణంగా అవసరానికి మించి ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది.
అత్యధికంగా వరి, పత్తి
ఈ సీజన్లో కనీసం 60 లక్షల ఎకరాల్లో వరి, 55 లక్షల ఎకరాల్లో పత్తి, 8 లక్షల ఎకరాల్లో కంది, 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 5 లక్షల ఎకరాల్లో సోయాబీన్, లక్ష ఎకరాల్లో పెసర సాగయ్యే అవకాశం ఉన్నదని అంచనా. అయితే పత్తితోపాటు కంది, పెసర లాంటి పప్పు పంటలను అధికంగా సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.
అవసరానికి మించి విత్తనాలు, ఎరువులు సిద్ధం
ఈ సీజన్లో విత్తనాలు, ఎరువులకు ఎలాంటి కొరత లేకుండా చూసేందుకు వ్యవసాయ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 1.40 కోట్ల ఎకరాల్లో సాధారణ పంటల సాగుకు మొత్తం 18.47 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేసిన అధికారులు.. ఏకంగా 22.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచారు. అవసరాని కంటే అదనంగా 4 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచడం గమనార్హం. ఎరువులను కూడా భారీగానే సిద్ధం చేశారు. మొత్తం 23.09 లక్షల టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచారు. ఇందులో 9.40 లక్షల టన్నుల ఎన్పీకే, 9.14 లక్షల టన్నుల యూరియాతోపాటు 36 వేల టన్నుల యూరియాకు సమానమైన 8 లక్షల బాటిళ్ల నానో యూరియా ఉన్నది.
రైతులకు అవగాహన
పంటలవారీగా సాగు విస్తీర్ణం
పంట అంచనా (లక్షల ఎకరాల్లో)
వరి 60
పత్తి 55
కంది 8
మొక్కజొన్న 8
సోయాబీన్ 5
పెసర 1
మినుము 0.50
జొన్న 0.80
వేరుశనగ 0.50
ఆముదం 0.25
ఇతర పంటలు 0.95
ఉద్యాన పంటలు 10.87
మొత్తం 150.87
సిద్ధంగా ఉన్న ఎరువులు
రకం లక్షల టన్నులు
యూరియా 9.14
డీఏపీ 2.30
ఎన్పీకే 9.40
ఎంవోపీ 1.25
ఎస్ఎస్పీ 1.00
మొత్తం 23.09
వీటితోపాటు 36 వేల టన్నుల యూరియాకు సమానమైన 8 లక్షల బాటిళ్ల నానో యూరియా అందుబాటులో ఉన్నది.