హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతున్నది. ఇప్పటికే గ్రూప్-1, పోలీస్, టీఎస్ ఎన్పీడీసీఎల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడగా.. వర్సిటీల్లోని ఉద్యోగాలను సైతం భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. కాళోజీ హెల్త్ వర్సిటీ మినహా రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాల్లో ఇకపై బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి కామన్ బోర్డును ఏర్పాటు చేసింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బోర్డుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రిని అధ్యక్షుడిగా, విద్య, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులను సభ్యులుగా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ కన్వీనర్గా ఉంటారని పేరొన్నది. అవసరం అనుకుంటే.. మరో సభ్యుడిగా నిపుణుడిని నియమించుకొనేందుకు బోర్డుకు వెసులుబాటు కల్పించింది. ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ, తెలంగాణ, తెలుగు, పాలమూరు, శాతవాహన, అంబేద్కర్, మహాత్మగాంధీ, జేఎన్ ఏఎఫ్ఏయూ, వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, అటవీ, ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయాల్లో నియామకాలను కామన్ బోర్డు చేపట్టనున్నది. బోర్డు విధివిధానాలు, నియామక ప్రక్రియ తదితర అంశాలపై త్వరలో స్పష్టత రానున్నది.
15 వర్సిటీల్లో ఉమ్మడి నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు. త్వరలోనే వర్సిటీల్లోని 3,500 ఉద్యోగాల భర్తీని బోర్డు చేపట్టనున్నది. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 12న మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గతంలో వర్సిటీలే వేర్వేరుగా ఉద్యోగ ప్రకటనలిచ్చి నియామకాలు చేపట్టేవి. తద్వారా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకే అ భ్యర్థి వేర్వేరు వర్సిటీల్లో ఉద్యోగానికి ఎంపికైనప్పుడు.. మళ్లీ ఖాళీలు ఏర్పడేవి!. దానికి తోడు ఒకో వర్సిటీ ఒకో విధానం అమలు చేయడం వల్ల గందరగోళం తలెత్తుతుందన్న సందేహాలు ఉండేవి. వీటిని పరిగణనలోకి తీసుకొని కామన్ బోర్డు నిర్వహిస్తూ.. ప్రభుత్వం జీవో 16 జారీ చేసింది. బోర్డు నిర్వహణ ఖర్చులను ఉన్నత విద్యా మండలి.. ఆయా వర్సిటీల నుంచి సేకరించి బోర్డుకు కేటాయిస్తుంది. నియామక ప్రక్రియపై త్వరలోనే విధివిధానాలు ఖరారు కానున్నాయి.