హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : డైరెక్టర్ ఆఫ్ హెల్త్(డీహెచ్) కార్యాలయంలో ఇటీవల వెలుగుచూసిన వరుస అవినీతి ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కమిటీలు వేసింది. ఈ బాధ్యతలను ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణకు అప్పగించింది. ఈ నెల 6న నమస్తే తెలంగాణలో ‘డీహెచ్లో షాడోల హల్చల్!’ పేరిట ఆ శాఖలో విజిలెన్స్ ఫైళ్లు క్లియర్ చేసేందుకు ఓ అధికారి లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఓ కథనం ప్రచురితమైంది. దీంతోపాటు గురువారం ‘వైద్యశాఖలో వసూళ్ల మహమ్మారి!’ పేరిట అడిషనల్ డైరెక్టర్ సహా మరో ఇద్దరు అధికారులు స్టాఫ్ నర్సు, అటెండర్ పోస్టులకు ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామని రూ.19.50 లక్షలు వసూలు చేసిన వైనాన్ని వెలుగులోకి తెచ్చింది. మరోవైపు అడిషనల్ డైరెక్టర్ సహా మరో ఇద్దరు ఉద్యోగులపై క్రిమినల్ కేసు నమోదైన విషయాన్ని ఈ ఏడాది జనవరిలో ఆ శాఖ కీలకాధికారికి దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలుపకుండా సదరు కీలకాధికారి గోప్యత పాటించినట్టు తేలింది.