రింగ్రోడ్డు పరిధిలో నాటేందుకు నిర్ణయం
ఇప్పటికే 600 ఎకరాల్లో శ్రీగంధం, రోజ్వుడ్ మొక్కల పెంపకం
టీఎస్ఎఫ్డీసీ ఎండీ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి
హైదరాబాద్, జులై 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పచ్చదనం పునరుద్ధరణలో భాగంగా యూకలిప్టస్ (జామాయిల్)తోటల స్థానంలో శ్రీగంధం, ఎర్రచందనం, ఇతర రకాల మొక్కల సాగుకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి అమలుచేస్తున్నది. రాష్ట్రంలో నాలుగు దశాబ్దాలుగా దాదాపు 7 వేల ఎకరాల్లో యూకలిప్టస్ తోటలు విస్తరించాయి. ప్రతి ఏడాది ఈ చెట్లను నరికిన తర్వాత మళ్లీ అదే నేల లో పెరుగుతాయి. దీనివల్ల నేల పూర్తిగా క్షీణిస్తున్నది. దీనిని గుర్తించిన టీఎస్ఎఫ్డీసీ.. వాణిజ్య మొక్కలు నాటి సంస్థ ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. అందులోభాగంగా హైదరాబాద్ చుట్టూ ప్రాంతీయ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న యూకలిప్టస్ తోటల స్థానంలో శ్రీగంధం, రోజ్వుడ్ వంటి ఇతర వాణిజ్య రకాల మొక్కలను నాటాలని టీఎస్ఎఫ్డీసీ నిర్ణయం తీసుకొన్నది. ఇప్పటికే సుమారు 600 ఎకరాల్లో శ్రీగంధం మొక్కలు నాటారు.
వాణిజ్య మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నాం
శ్రీగంధం మొక్కలు పక్షుల జీవవైవిధ్యాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతాయి. రింగ్రోడ్డు పరిధిలో సుమారు 170 ఎకరాల్లో శ్రీగంధం, 250 ఎకరాల్లో టేకు మొక్కలు, 75 ఎకరాల్లో రోజ్వుడ్, 75 ఎకరాల్లో ఎర్రచందనం మొక్కలు నాటాం. గతంలో ఎర్రచందనం, రోజ్వుడ్, శ్రీగంధం మొక్కలను కేరళ, తమిళనాడు నుంచి అధిక ఖర్చుతో తీసుకొచ్చేవారు. ప్రస్తుతం టీఎస్ఎఫ్డీసీ ఆధ్వర్యంలో నర్సరీల్లో పెంచుతున్నాం.
– టీఎస్ఎఫ్డీసీ ఎండీ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి