BJP | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): మొన్నటి వరకూ ఈటల వర్సెస్ బండి.. నేడు ఈటల వర్సెస్ కిషన్రెడ్డి.. కమలదళంలో మళ్లీ కోల్డ్వార్ మొదలయ్యింది. తెలంగాణ కమలదళంలో రాజకీయ చదరంగం రంజుగా సాగుతున్నది. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నంత కాలం ఈటల రాజేందర్… ఆయన మధ్య అంతర్గత విభేదాలు నడిచాయి. బండిని ఇంటికి పంపిన తర్వాతగానీ ఆ విభేదాలు చల్లారలేదు. తాజాగా, కమలం పార్టీలో రెండో ఇన్నింగ్స్ మొదలయ్యింది. ఇప్పుడు ఈటల రాజేందర్, కిషన్రెడ్డి మధ్య పోరు ప్రారంభమైంది.
ఎత్తుకు పైఎత్తు.. పార్టీ పరువు చిత్తు!
రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఇటు చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఎత్తుకు పైఎత్తులు వేసుకొంటూ.. బీజేపీ పరువు తీస్తున్నారనే అభిప్రాయం ఆ పార్టీవర్గాల్లో వ్యక్తమవుతున్నది. వేములవాడ నియోజకవర్గంలో తుల ఉమకు టికెట్ ఇప్పించుకొనేందుకు ఈటల మొదటి నుంచీ ప్లాన్ సిద్ధం చేశారు. మరోవైపు నగరంలోని అంబర్పేటనుంచి తన సతీమణికి టికెట్ ఇప్పించుకోవాలని కిషన్రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారనేది పార్టీవర్గాల సమాచారమే. రెండు నియోజకవర్గాల్లో ఇద్దరూ తమ తమ వ్యూహాల్లో నిమగ్నమై ఉన్నారు. కాగా, అంబర్పేటకు చెందిన మాజీ మంత్రి కృష్ణయాదవ్ను బీజేపీలో చేర్పించేందుకు ఈటల రంగం సిద్ధం చేయగా.. ఏకంగా మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు కుమారుడు డాక్టర్ వికాస్రావుకు బీజేపీ కండువా కప్పి ఈటలకు కిషన్రెడ్డి చెక్ చెప్పారు.
వేములవాడలో తన వ్యూహానికి చెక్ పెట్టేందుకే వికాస్రావును పార్టీ లో చేర్చుకొన్నారా? అని కిషన్రెడ్డిని ఈటల నిలదీసినట్టు సమాచారం. ‘వాళ్లు రాజకీయాల్లోకి వస్తానన్నారు, వాళ్లది బీజేపీ కుటుంబమైనందునే నేను చేర్చుకున్నా’ అంటూ కిషన్రెడ్డి బదులిచ్చినట్టు తెలిసింది. దీంతో ఈటల ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకొని పత్తా లేకుండా పోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. అటు ఈటల ఫోన్ బంద్.. ఇటు పార్టీ కార్యాలయం నుంచి పిలుపు రాకపోవడంతో కృష్ణయాదవ్ తలపట్టుకొంటున్నారు. ఈటల, కిషన్రెడ్డి పోరుతో పార్టీ పరువు బజారునపడటమేకాదు.. టికెట్ ఆశావహుల్లో గుబులు రేపుతున్నదని నేతలు వాపోతున్నారు.