Cold Weather | జూబ్లీహిల్స్/హైదారాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చలి క్రమంగా పెరుగుతున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రమంతటా ఉదయం 9 గంటల వరకు మంచు దుప్పటి కప్పుకుంటున్నది. దీంతో వాహనదారులకు ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో చలిగాలులు మరింత ఎక్కువగా వీచే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చలి ఎక్కువగా ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం పలుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్లో గడిచిన 24 గంటల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీల కనిష్ఠానికి పడిపోయాయి.
కుమ్రంభీం జిల్లా సిర్పూర్ (యూ)లో 10.4, నిర్మల్ జిల్లా పెంబిలో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, మంచిర్యాల జిల్లా భీమినిలో 14.8గా ఉన్నది. సోమవారం వరకు చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగానే డిసెంబర్, జనవరిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రానున్న రెండు రోజులు ఉమ్మడి ఆదిలాబాద్లో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొన్నది. మరోవైపు గ్రేటర్ పరిధిలోనూ చలి వణికిస్తున్నది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15.7 డిగ్రీలు.. గాలిలో తేమ 47 శాతంగా నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్టు అధికారులు వెల్లడించారు.