హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): కొత్త ఓపెన్కాస్ట్ (ఓసీ) బొగ్గు గనుల్లో నిర్దేశిత ప్రణాళిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉత్పత్తి ప్రారంభించాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ సంస్థ అధికారులను ఆదేశించారు. ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకు, కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓపెన్కాస్ట్, రామగుండం రీజియన్లోని ఆర్జీ కోల్మైన్, గోలేటి ఓసీ గనుల్లో ఉత్పత్తి ప్రారంభించాలని, ఇందుకు అవసరమైన అనుమతులు, టెండర్ ప్రక్రియలను పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
సింగరేణి ఆధ్వర్యంలోని ఓపెన్కాస్ట్ గనులపై మంగళవారం ఆయన హైదరాబాద్లోని సింగరేణి భవన్ నుంచి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. నైనీ బొగ్గు బ్లాక్కు సంబంధించి పెండింగ్లో ఉన్న స్టేజీ-2 అనుమతులను వెంటనే సాధించి, సెప్టెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలన్నారు. ఈ గని సమీపంలోని రైల్వే సైడింగ్ వరకు బొగ్గు రవాణాకు వీలుగా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ టెండర్ను సైతం వెంటనే ఖరారు చేయాలని తెలిపారు. కొత్తగూడెం వీకే ఓపెన్కాస్ట్కు సంబంధించిన అనుమతులను కూడా త్వరగా పొంది, నవంబర్లో ఉత్పత్తి ప్రారంభించాలని ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ గని నుంచి 10 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తిని సాధించాలని చెప్పారు.
రామగుండం రీజియన్లో గతంతో మూతబడిన భూగర్భ గనులను కలుపుతూ కొత్తగా చేపట్టిన రామగుండం కోల్మైన్, బెల్లంపల్లి ఏరియాలో మూతబడిన రెండు భూగర్భ గనులు, అబ్బాపూర్ బ్లాక్తో కలిపి చేపడుతున్న గోలేటి ఓపెన్కాస్ట్ గనిలో సైతం ఈ ఆర్థిక సంవత్సరంలోనే బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలన్నారు. 2023-24లో చేపట్టే జేకే ఓపెన్కాస్ట్ (రొంపేడు ఓసీ) ఎంవీకే ఓపెన్కాస్ట్, తాడిచెర్ల ఓపెన్కాస్ట్-2 సహా ఇతర ప్రతిపాదనలపైనా సీఎండీ సమగ్రంగా చర్చించారు. సంస్థ డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్, ఎన్ బలరామ్, డీ సత్యనారాయణరావు, డీఎన్ ప్రసాద్, కే సూర్యనారాయణ, కే కొండయ్య, సురేశ్ తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.