హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి గణనీయమైన వృద్ధి సాధిస్తున్నదని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తిలో 33 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. గతేడాది ఫిబ్రవరి నాటికి 425 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయగా, ఈ ఏడాది 595 లక్షల టన్నుల రవాణా చేశామని వెల్లడించారు. గతేడాది ఫిబ్రవరి నాటికి 442 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది అదే కాలానికి 33 శాతం వృద్ధితో 586 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించామని వివరించారు. ఓవర్ బర్డెన్ వెలికితీతలోనూ ముందంజలో ఉన్నామని తెలిపారు. గతేడాది 288 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ సాధించగా, ప్రస్తుతం 20 శాతం వృద్ధితో 346 లక్షల క్యూబిక్ మీటర్లు సాధించినట్టు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో నెల సమయం ఉన్నందున మరింత వృద్ధి సాధిస్తామని పేర్కొన్నారు. కార్మికుల శ్రమకు భారీ యంత్రాల వినియోగం, ఓఎంఎస్తోడు కావడంతోనే ఈ ఘనత సాధించామని వివరించారు. థర్మల్ విద్యుత్తు అమ్మకాల్లో 19 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం (ఎస్టీపీపీ) ఇప్పటికే 26 శాతం వృద్ధి రేటు నమోదు చేసిందని చెప్పారు. గతేడాది ఫిబ్రవరి నాటికి రూ. 2,964 కోట్ల విలువైన విద్యుత్తు అమ్మగా, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.3,523 కోట్ల వ్యాపారం చేశామని వివరించారు. ఎనిమిది సోలార్ ప్లాంట్ల ద్వారా 239 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేశామని, ఇది సింగరేణి ఉద్యోగులు, కార్మికుల కృషికి దక్కిన ఫలితమని పేర్కొన్నారు.