హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): బ్రాహ్మణ అభ్యర్థులకు వివిధ పోటీ పరీక్షల కోసం మే 16 నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్ డాక్టర్ రమణాచారి చెప్పారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని స్టడీ సెంటర్లలోనే వీరికి కోచింగ్ ఇస్తామని తెలిపారు. శనివారం బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం నుంచి www.brahminparishad.telangana.gov.in ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని రమణాచారి సూచించారు. ఒక్కో క్యాటగిరీ నుంచి వంద మందిని ఎంపిక చేయాలని, ఒకవేళ అంతకుమించి అభ్యర్థులు ఉంటే అదనపు బ్యాచ్లు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు.
స్క్రీనింగ్ వివరాలు అభ్యర్థి మొబైల్ నంబర్కు పంపుతామని చెప్పారు. కోచింగ్ను, స్టడీ మెటీరియల్ కూడా ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో అందిస్తామని తెలిపారు. పోలీసు ఉద్యోగాలకు శరీర దారుఢ్య పరీక్షలకు కూడా శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాల అభ్యర్థులకు ఏప్రిల్ 21 నుంచే కోచింగ్ ప్రారంభమైందని, ఇందులో ఐదు శాతం ఇతర వర్గాలకు చెందినవారికి కూడా ప్రవేశాలు కల్పించామని బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం చెప్పారు. ఐదు శాతంలో బ్రాహ్మణులు ఉంటే వారు ైస్టెఫండ్ కోసం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. బీసీ స్టడీ సెంటర్లలో కోచింగ్ ఇప్పిస్తున్నప్పటికీ అందుకు అయ్యే ఖర్చును బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు భరిస్తుందని పరిషత్ సభ్య కార్యదర్శి అనిల్కుమార్ తెలిపారు.
కోచింగ్కు సబంధించిన ముఖ్యమైన వివరాలు
దరఖాస్తుల స్వీకరణ: 1-05-22 నుంచి 7-05-22 వరకు
స్టడీ కేంద్రాల్లో స్క్రీనింగ్: 8-05-22 నుంచి 15-05-22 వరకు
ఎంపికైనవారికి కోచింగ్: 16-05-22 నుంచి
గ్రూప్-1 అభ్యర్థులకు ప్రతి నెలా ైస్టెఫండ్:5000
ఇతర పరీక్షలకు పోటీపడేవారికి నెలకు: 2000
ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్రాలు: 12
కొత్తగా ప్రతిపాదించినవి: 5